Share News

క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:19 AM

నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా గత నెల 20న ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులతో బలవంతంగా క్షమాపణలు చెప్పిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై కాంగ్రెస్‌ అగ్రనేత...

క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు

  • 15 ఏళ్ల బాలికతో బలవంతంగా

  • క్షమాపణ చెప్పించడం దారుణం

  • కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహం

  • ఢిల్లీలో నిరసన సందర్భంగా వేధింపులకు

  • గురైన విద్యార్థినులతో సమావేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 5: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా గత నెల 20న ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులతో బలవంతంగా క్షమాపణలు చెప్పిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. చలో సంసద్‌ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థులపై క్షమాపణ చెప్పాలని మొదట ఒత్తిడి తెచ్చి, ఆ తర్వాత వారి ఇళ్లకు గూండాలను పంపి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ నిరసన కార్యక్రమం సందర్భంగా వేధింపులకు గురైన ఐదుగురు విద్యార్థులను రాహుల్‌గాంధీ బుధవారం కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులు చేసింది తప్పుకాదని, వారు ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణ చెప్పించి, తర్వాత ఆ బాలికను క్షమిస్తున్నట్లు ప్రకటన చేయటం పూర్తిగా మూర్ఖత్వం’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి చర్యలను మేము ఏమాత్రం సహించం. ఈ బాలికలు మీడియా ముందు ధైర్యంగా నిలబడ్డారు. కానీ, మోదీ, అమిత్‌ షాలకు మీడియా ముందుకు వచ్చే దమ్ములేదు’ అని రాహుల్‌గాంధీ అన్నారు. మరోవైపు, నీట్‌ పేపర్‌లీక్‌పై నిరసన సందర్భంగా విద్యార్థులపై పోలీసుల కఠిన చర్యల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అలాగే, అయోధ్యలో రాముడి విరాళాల దుర్వినియోగం, జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా అంశాలపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎంపీలు బుధవారం పార్లమెంట్‌ భవన సముదాయం వద్ద నిరసన తెలిపారు.

ఇవీ చదవండి:

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

Updated Date - Aug 06 , 2026 | 05:19 AM