పెను విషాదం.. బాస్కెట్ బాల్ హూప్ పట్టుకుని పుల్అప్స్ చేస్తుండగా..
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:40 AM
మహారాష్ట్రలోని పుణేలో పెను విషాదం చోటుచేసుకుంది. బాస్కెట్ బాల్ హూప్ పట్టుకుని పుల్అప్స్ చేస్తుండగా.. ఫ్రేమ్ ఊడి మీదపడ్డంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
ముంబై, ఏప్రిల్ 6: బాస్కెట్ బాల్ హూప్ పట్టుకుని ఓ విద్యార్థి పుల్అప్స్ చేస్తుండగా పెను విషాదం చోటుచేసుకుంది. బాస్కెట్ బాల్ ఫ్రేమ్ ఊడి మీదపడ్డంతో ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్లోని బస్తీ ప్రాంతానికి చెందిన విశాల్ వర్మ పుణెలోని తులానీ మేరీటైమ్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లాడు. క్యాంపస్లో ఎక్సర్సైజులు చేయసాగాడు. ఈ నేపథ్యంలోనే బాస్కెట్ బాల్ హూప్ను పట్టుకుని పుల్అప్స్ చేయసాగాడు.
బాస్కెట్ బాల్ ఫ్రేమ్ అతడి బరువును మోయలేకపోయింది. ఫ్రేమ్ మొత్తం ఊడి అతడిపై పడింది. దీంతో వర్మ తలకు బలమైన గాయాలు అయ్యాయి. గాయాల నుంచి పెద్ద మొత్తంలో రక్తం కారసాగింది. ఇది గమనించిన తోటి విద్యార్థులు, కాలేజ్ సిబ్బంది హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. వర్మను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై తులానీ మేరీటైమ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీత్ కనుంగో మాట్లాడుతూ.. ప్రమాదం కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.
బాస్కెట్ బాల్ హూప్ను పట్టుకుని పుల్అప్స్ తీస్తుండగా ఈ విషాదం జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. ఇక, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాస్కెట్ బాల్ ఫ్రేమ్ ఊడిపోవడానికి కారణం ఏంటన్న దానిపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. బాస్కెట్ బాల్ ఫ్రేమ్ తుప్పు పట్టడం వల్ల ఊడిందా? లేదా ఫిట్టింగ్లో లోపం కారణంగా ఊడిందా అన్నది తెలుసుకునే పనిలో పడ్డారు.
ఇవి కూడా చదవండి
స్టేడియంలో యువతి చేసిన రచ్చ.. ఫిదా అయిన ఆర్సీబీ ఫ్యాన్స్!
అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి