కిడ్నాప్ డ్రామా ఆడిన యువకుడు.. ఆ చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయాడు..
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:29 PM
నిరుద్యోగం, ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఓ యువకుడు తప్పుదారి పట్టాడు. కిడ్నాప్ డ్రామా ఆడి తల్లిదండ్రులను మోసం చేయాలని చూశాడు. అయితే, సెల్ ఫోన్ సిగ్నల్స్ కారణంగా కిడ్నాప్ డ్రామా ఫెయిల్ అయింది. అతడు అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: నిరుద్యోగం, ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఓ యువకుడు తప్పుదారి పట్టాడు. కిడ్నాప్ డ్రామా ఆడి తల్లిదండ్రులను మోసం చేయాలని చూశాడు. వారినుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేయాలని అనుకున్నాడు. అయితే, సెల్ ఫోన్ సిగ్నల్స్ కారణంగా కిడ్నాప్ డ్రామా ఫెయిల్ అయింది. అతడు అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర్ప్రదేశ్లోని బంద జిల్లాకు చెందిన ఓం ప్రకాశ్ గౌరీ శంకర్ అనే 19 ఏళ్ల యువకుడు ఉద్యోగం కోసం పుణె వచ్చాడు.
నెలలు గడుస్తున్నా ఉద్యోగం దొరక్కపోవటంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఆర్థిక కష్టాలనుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తున్న సమయంలో మోసపూరితమైన ఆలోచన వచ్చింది. కిడ్నాప్ డ్రామా మొదలెట్టాడు. తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, 5 లక్షల రూపాయలు ఇస్తేనే విడుదల చేస్తామని అంటున్నారని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబసభ్యులను నమ్మించటం కోసం ఏడుస్తూ ఓ వీడియో చిత్రీకరించి పంపాడు. భయపడిపోయిన కుటుంబసభ్యులు వెంటనే ఉత్తర్ప్రదేశ్ పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్ కేసు పెట్టారు.
ఉత్తర్ప్రదేశ్ పోలీసులు పుణె పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆగస్టు 16వ తేదీన పుణె పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు. పలు పోలీస్ స్టేషన్లకు చెందిన బృందాలు, నైట్ పెట్రోలింగ్ యూనిట్స్ రంగంలోకి దిగాయి. పోలీసులు ఓం ప్రకాశ్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు ఎక్కడున్నాడో వెతకటం మొదలెట్టారు. ఓ హోటల్ దగ్గర సెల్ ఫోన్ సిగ్నల్స్ చూపిస్తుండటంతో అక్కడికి వెళ్లారు. హోటల్ పరిసరాల్లో తిరుగుతున్న ఓం ప్రకాశ్ పోలీసులకు కనిపించాడు. పోలీసులు ఓం ప్రకాశ్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. డబ్బు కోసమే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు చెప్పాడు.
ఇవి కూడా చదవండి
ఇంట్లోనే ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ను మార్చుకోండి.. అదెలాగంటే..
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసుల పెండింగ్