శ్రావణ మాసంలో మటన్ కావాలన్న కొడుకు.. కొట్టిచంపిన తండ్రి..
ABN , Publish Date - Aug 28 , 2026 | 07:36 AM
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో మటన్ కావాలంటూ వేధించిన కొడుకును ఓ తండ్రి కొట్టిచంపాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో బుధవారం చోటుచేసుకుంది.
ఇంటర్నెట్డెస్క్: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో మటన్ కావాలంటూ వేధించిన కొడుకును ఓ తండ్రి కొట్టిచంపాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణెకు చెందిన మహేశ్ గైక్వాడ్ అనే 30 ఏళ్ల యువకుడి తల్లిదండ్రులు శ్రావణ మాసం కావటంతో మాంసాహారం తినటం మానేశారు. ఈ విషయం తెలిసి కూడా మహేశ్ తనకు మటన్ వండిపెట్టమని తల్లిని అడిగాడు. శ్రావణ మాసంలో మాంసాహారం చేయటం కుదరదని తండ్రి తేల్చి చెప్పాడు. తండ్రీకొడుకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
కొద్దిసేపటికే ఆ గొడవ పెద్దదైంది. మహేశ్ను తండ్రి దారుణంగా కొట్టాడు. తీవ్రగాయాలపాలైన మహేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మహేశ్ మరణంపై అతడి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. హత్య విషయం బయటకు తెలియకుండా ఉండాలని వారు భావించారు. ఆధారాలను నాశనం చేశారు. అయినా పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయారు. వార్జే మాల్వాడీ పోలీసులకు మహేశ్ తల్లిదండ్రులపై అనుమానం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ..మళ్లీ ఎన్డీయేనే!
అనుబంధాల వేడుక.. నేడు రక్షాబంధన్..