బంకీపూర్ ఉపఎన్నిక.. బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ ఆధిక్యం
ABN , Publish Date - Aug 03 , 2026 | 01:51 PM
బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో నిలిచిన జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. విజయం దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బంకీపూర్ (బిహార్) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో నిలిచిన జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. నేడు కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ బీజేపీ నేత నీరజ్ కుమార్ కంటే ముందంజలో ఉన్న ప్రశాంత్ కిశోర్ ఒక్కో రౌండ్ ముగిసేసరికి తన ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటున్నారు. ప్రస్తుతం 23 రౌండ్లు ముగిసేసరికి సమీప బీజేపీ ప్రత్యర్థితో పోలిస్తే 13,269 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బంకీపూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ కంచుకోటగా ఈ నియోజకవర్గానికి పేరుంది. 1995 నుంచి అక్కడ బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ అసాధారణ ఆధిక్యంతో దూసుకుపోతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఈ ఎన్నికలో నెగ్గితే జన్ సురాజ్ పార్టీకి ఇది తొలి విజయంగా నిలిచిపోతుంది. ఇక గత రెండు ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఆర్జేడీకి ఈసారి జనాదరణ మరింతగా తగ్గింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో యువత ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికలో ఓటమి బీజేపీకి కచ్చితంగా షాకిస్తుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
మరో పేపర్ లీక్.. స్టూడెంట్స్కు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు
కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ హతం.. తుపాకీ లాక్కుని పారిపోతుండగా