ప్రియురాలి కోసం భారత్లోకి చొరబాటు.. పాక్ ఆర్మీకి యువకుడి అప్పగింత..
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:31 AM
ప్రియురాలి కోసం భారత్లోకి చొరబడ్డ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన 22 ఏళ్ల యువకుడిని భారత్ ఆర్మీ సొంత దేశానికి పంపేసింది. భారత ఆర్మీ అధికారులు శనివారం ఆ యువకుడిని పాకిస్థాన్ ఆర్మీ అధికారులకు అప్పగించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రియురాలి కోసం భారత్లోకి చొరబడ్డ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన 22 ఏళ్ల యువకుడిని భారత్ ఆర్మీ సొంత దేశానికి పంపేసింది. భారత ఆర్మీ అధికారులు శనివారం ఆ యువకుడిని పాకిస్థాన్ ఆర్మీ అధికారులకు అప్పగించారు. ఈ విషయంపై చినార్ కార్ప్స్ ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
ఆ పోస్టులో.. ‘2026, మే 31వ తేదీన ఉరీ సెక్టార్లో నియంత్రణ రేఖ దాటుతుండగా పట్టుబడిన పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నివాసి జీషన్ మీర్ను భారత ఆర్మీ అధికారులు 2026, జులై 4వ తేదీ మధ్యాహ్నం 12:24 గంటలకు (భారత ప్రామాణిక కాలమానం ప్రకారం) తిరిగి అతని స్వదేశానికి పంపించారు. కమాన్ అమన్ సేతు వద్ద అతడిని అధికారికంగా పాక్ ఆర్మీ అధికారులకు అప్పగించారు. భారతదేశంలో ఉన్న సమయంలో జీషన్ మీర్ను భారత ఆర్మీ అధికారులు ఎంతో గౌరవంతో.. మానవత్వంతో.. తగిన జాగ్రత్తలతో చూసుకున్నారు. భారత సైన్యానికి వృత్తిపరమైన ప్రవర్తన పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధత, మానవీయ విలువలను ప్రతిబింబిస్తుంది’ అని పేర్కొంది.
ఆన్లైన్లో ప్రేమ.. ప్రియురాలి కోసం ఇండియాలోకి..
పాక్ ఆక్రమిత కాశ్మీర్, ముజఫరాబాద్లోని పైన్కడికి చెందిన జీషన్ అహ్మద్ మిర్కు కొన్ని నెలల క్రితం కశ్మీర్లోని ఉరీ సెక్టార్కు చెందిన ఐరమ్ బానోతో ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే బానోను కలవాలని జీషన్ అహ్మద్ భావించాడు. మే 31వ తేదీ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో పాక్ నుంచి భారత్లోకి చొరబడ్డాడు. భద్రతా దళాలు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అదే ప్రాంతంలో ప్రియుడి కోసం వేచి ఉన్న బానోను కూడా అదుపులోకి తీసుకున్నాయి.
ఇవి కూడా చదవండి
అందరికీ రుణపడి ఉంటా.. అరంగేట్రం తర్వాత వైభవ్ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ పాండవాణి గాయని తీజన్ బాయి కన్నుమూత