Share News

అంతరిక్షంలోకి ప్రధాని మోదీ రాసిన పోస్ట్‌కార్డు..

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:25 PM

స్కైరూట్ సంస్థ రేపు (శనివారం) 'మిషన్ ఆగమన్' పేరిట 'విక్రమ్-1' రాకెట్‌ను శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి పంపనుంది. ఈ రాకెట్‌ సాంకేతిక పరికరాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన చేతులతో రాసిన ఓ పోస్ట్‌కార్డును కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది.

అంతరిక్షంలోకి ప్రధాని మోదీ రాసిన పోస్ట్‌కార్డు..
Skyroot Aerospace

ఇంటర్‌నెట్ డెస్క్: స్కైరూట్ సంస్థ రేపు (శనివారం) 'మిషన్ ఆగమన్' పేరిట 'విక్రమ్-1' రాకెట్‌ను శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి పంపనుంది. ఈ రాకెట్‌ సాంకేతిక పరికరాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన చేతులతో రాసిన ఓ పోస్ట్‌కార్డును కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ప్రధాని మోదీ ఆ పోస్ట్‌కార్డుపై ‘వందేమాతరం’ అని రాశారు. ఈ రాకెట్‌లో ప్రధాని మోదీ రాసిన పోస్ట్‌కార్డు మాత్రమే కాకుండా.. ఇస్రోకు చెందిన ప్రస్తుత, మాజీ చైర్మన్లు.. భారతీయ వ్యోమగాములు, స్కైరూట్ బృందం, ఇన్వెస్టర్లు, విధాన రూపకర్తలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు రాసిన వందలాది చేతిరాత పోస్ట్‌కార్డులు కూడా అంతరిక్షంలోకి వెళ్లనున్నాయి.


భారత గడ్డపై నుంచి అంతరిక్ష కక్ష్యలోకి వెళుతున్న మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 కావటం విశేషం. ఇది దాదాపు 7 అంతస్తుల భవనం ఎత్తు ఉంటుంది. పూర్తిగా కార్బన్ కాంపోజిట్‌తో తయారు చేసిన ఈ రాకెట్ ఇంజన్లను 3D-ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా తయారు చేశారు. ఇది భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి 350 కేజీల బరువును తీసుకెళ్లగలదు. 2022 నవంబర్ నెలలో స్కైరూట్ సంస్థ 'విక్రమ్-S' అనే చిన్న రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఇప్పుడు పూర్తి స్థాయి ఉపగ్రహాలను మోసుకెళ్లే 'విక్రమ్-1'తో సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది.


ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి..

విక్రమ్-1 రాకెట్ ద్వారా సాంకేతిక పరికరాలు, పోస్టు కార్డులు మాత్రమే కాదు.. మైక్రో-ఆర్ట్‌ను కూడా అంతరిక్షంలోకి పంపనున్నారు. భారతదేశానికి చెందిన ముగ్గురు గొప్ప సైంటిస్టులు.. సర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ విగ్రహాలను స్కైరూట్ సంస్థ అంతరిక్షంలోకి పంపనుంది. మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ మట్టెవాడ.. 18 క్యారెట్ల బంగారంతో ఒక చిన్న రాకెట్ ఆకృతిని తయారు చేసి.. అందులో ఈ ముగ్గురు సైంటిస్టుల విగ్రహాలను చెక్కారు. భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో సూపర్ పవర్‌గా నిలిపిన ఆ ముగ్గురు మహానుభావుల గౌరవార్థం స్కైరూట్ ఈ వినూత్న ప్రయత్నం చేస్తోంది.


ఇవి కూడా చదవండి

సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన.. హెలిప్యాడ్, సభా వేదికలు ఖరారు

తిరుమల వెళ్తున్నారా? టీటీడీ వసతి గదులు ఇలా బుక్ చేసుకోండి

Updated Date - Jul 17 , 2026 | 12:45 PM