మహిళా, పునర్విభజన బిల్లులు సిద్ధం
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:53 AM
ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో.. మహిళా రిజర్వేషన్తోపాటు నియోజకవర్గాల పునర్విభజనకు వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును...
16 నుంచి పార్లమెంటు సమావేశాలు
బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో.. మహిళా రిజర్వేషన్తోపాటు నియోజకవర్గాల పునర్విభజనకు వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్.. రాజ్యాంగ సవరణబిల్లుతో పాటు మూడు ముసాయిదా బిల్లులను బుధవారం ఆమోదించింది. అసెంబ్లీలున్న కేంద్ర పాలిత ప్రాం తాల్లోనూ మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక బిల్లును ప్రవేశ పెడతారు. కాగా, ఏప్రిల్ 16న లోక్సభ సమావేశమవుతుందని లోక్సభ సెక్రటేరియట్ ఆఫీసు గురువారం మెమోరాండం జారీ చేసింది. ఈ సమావేశాల్లో కేవలం అత్యవసర ప్రభుత్వ నిర్ణయాలను మాత్రమే చర్చిస్తామని పేర్కొన్నారు. అయితే, ఎన్ని రోజులు ఈ సమావేశాలు జరుగుతాయన్న దానిపై ఈ మెమోరాండంలో స్పష్టతను ఇవ్వకపోవటం గమనార్హం. సాధ్యమైనంత మేరకు మూడు రోజుల్లోనే బిల్లులను ఆమోదించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అవసరమైతే మరికొన్ని రోజులపాటు సమావేశాల్ని పొడిగించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
ఆమోదానికి అందరూ సహకరించాలి: మోదీ
చట్టసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ కల్పించే బిల్లు ఆమోదానికి అన్ని వర్గాలు సహకరించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీ గురువారం పిలుపునిచ్చారు. కాగా, ఈ బిల్లుల ఆమోదం కోసం ఇప్పటికే దాదాపు అన్ని రాజకీయ పార్టీలతో ప్రభుత్వ వర్గాలు చర్చలు జరిపాయి. పుదుచ్చేరితోపాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ముగిసేంతవరకు ఈ బిల్లులపై చర్చ వద్దని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రభు త్వం పట్టించుకోకుండా ముందుకెళ్లటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. ప్రతిపక్షాల్లో చీలిక తీసుకొచ్చి అయినా ఈ బిల్లులను ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పునర్విభజన కోసం డీలిమిటేషన్ కమిషన్
డీలిమిటేషన్ బిల్లులో భాగంగా 2021 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజించే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు. ప్రతిపాదిత మార్పుల ప్రకారం లోక్సభ సీట్లు 543 నుంచి 816కు పెరుగుతాయి. దాంట్లో మూడోవంతు సీట్లు (273) మహిళలకు రిజర్వు అవుతాయి. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ సీట్లు కూడా పెరుగుతాయి. ఈ బిల్లులు 2029 మార్చి 31 నుంచి అమలులోకి వస్తాయని, ఆ ఏడాది జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ వ ర్తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, పార్లమెంటు సమావేశాలకు ముందే ఈనెల 13వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారీస్థాయిలో నిర్వహించే మహిళా సమ్మేళనంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు మహిళా ఎంపీలందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. మహిళా సంవాద్ పేరుతో బీజేపీ కూడా పెద్ద ఎత్తున మహిళా సదస్సులు జరపాలని నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News