కీలక బిల్లులు లేకుండానే పార్లమెంటు వాయిదా!
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:34 AM
పార్లమెంట్ వ ర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి! ఎఫ్సీఆర్ఏ, డీలిమిటేషన్, మహిళా కోటా వంటి కీలక బిల్లులు ప్రవేశపెట్టకుండానే ఉభయ సభలూ వాయిదా పడే...
నేటి లోక్సభ ఎజెండాలో ‘మైన్స్ అండ్ మినరల్స్’ బిల్లు మాత్రమే.. చర్చ నుంచి కాంగ్రెస్ పారిపోతోంది: కిరెన్ రిజిజు
న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ వ ర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి! ఎఫ్సీఆర్ఏ, డీలిమిటేషన్, మహిళా కోటా వంటి కీలక బిల్లులు ప్రవేశపెట్టకుండానే ఉభయ సభలూ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం లోక్సభ.. కేరళ రాష్ట్ర పేరును ‘కేరళం’గా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించడం మినహా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే గందరగోళం మధ్య వాయిదాపడింది. బుధవారం లోక్సభ ఎజెండాలో.. ఇప్పటికే ప్రవేశపెట్టిన ‘మైన్స్ అండ్ మినరల్స్’ బిల్లును మాత్రమే చేర్చారు. విదేశీ విరాళాలను నియంత్రించే ఎఫ్సీఆర్ఏ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించేందుకు కూడా ప్రతిపక్షాలు అంగీకరించకపోవడంతో ఆ బిల్లుకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల నిరసనపై అమిత్షా ప్రకటన చేసేందుకు సిద్ధపడినప్పటికీ, అయోధ్యలో విరాళాల చోరీ గురించి కూడా చర్చించాలని పట్టుబట్టడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రతిపక్షాలు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పేందుకు అమిత్ షా అంగీకరించారని.. కానీ ప్రతిపక్షాలే అంగీకరించడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మీడియాకు చెప్పారు. వారు సభలో గందరగోళం సృష్టించి బయటకు వెళ్లి నినాదాలు చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చర్చ నుంచి పారిపోతోందని ధ్వజమెత్తారు. ఝార్ఖండ్లో విద్యార్థులపై లాఠీచార్జీ జరిగిందని.. దానికి రాహుల్ సమాధానం చెప్పాలన్నారు.
ఇవి కూడా చదవండి
భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్
నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్