లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:00 PM
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసులు అందజేశారు. అవిశ్వాసం నోటీసులపై 119 మంది ఎంపీలు సంతకాలు చేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసులు అందజేశారు. అవిశ్వాసం నోటీసులపై 119 మంది ఎంపీలు సంతకాలు చేశారు. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ ఎంపీలు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. అయితే ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు అవిశ్వాసం నోటీసులపై సంతకాలు చేసేందుకు ఒప్పుకోలేదు. ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించింది.
కాగా.. సభలో తాము మాట్లాడేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించడం లేదంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజా బడ్జెట్ సమావేశాల సందర్భంగా 8 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. భారత్-చైనా ఉద్రిక్తతలకు సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ నరవణె అముద్రిత పుస్తకంలోని అంశాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో ఎంపీలు నిరసనలకు దిగి సస్పెన్షన్కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తీరుపై ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి పూనుకుంది.
సాధారణంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఆ ప్రకారం బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో అవిశ్వాస తీర్మనం సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్ తొలి విడత సమావేశాలు జనవరి 8న ప్రారంభమై ఫిబ్రవరి 13న ముగియనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఇవి కూడా చదవండి
మీ చూపు పవర్ఫుల్ అయితే.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 51 సెకెన్లలో కనిపెట్టండి
హైదరాబాద్ శివారులో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..