ప్రైవేట్ స్కూళ్ల పుస్తకాల ధరలను ఇష్టారాజ్యంగా పెంచొద్దు ఎన్హెచ్ఆర్సీ
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:49 AM
ప్రైవేట్ స్కూళ్లల్లో పుస్తకాల ధరలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలను ఇష్టారాజ్యంగా విద్యార్థులపై...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ స్కూళ్లల్లో పుస్తకాల ధరలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలను ఇష్టారాజ్యంగా విద్యార్థులపై ఎలా రుద్దుతారని నిలదీసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర విద్యాశాఖ, సీబీఎ్సఈతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాం తాలకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు స్కూళ్లలో ఇష్టానుసారంగా సాగుతున్న ఈ వ్యాపార పోకడలు పిల్లల ‘ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం’ ఉల్లంఘన కిందకే వస్తాయని కమిషన్ అభిప్రాయపడింది. ప్రైవే టు పబ్లిషర్ల పుస్తకాల ధరలు భారీగా ఉన్నాయని, దీనివల్ల మధ్య తరగతి తల్లిదండ్రులు ఆర్థికంగా కుంగిపోతున్నారని కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కానూంగో నేతృత్వంలోని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్సీఈఆర్టీ పుస్తకాల ధర రూ.200 నుంచి రూ.700 మధ్యలో ఉంటే, ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాల సెట్ ధర రూ.3,000 నుంచి రూ.10,000 వరకు ఉంటోందని కమిషన్ దృష్టికి వచ్చింది. అనేక ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలను సూచించడంవల్ల స్కూల్ బ్యాగుల బరువు అసాధారణంగా పెరుగుతోందని, ఇది చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుందని ఎన్హెచ్ఆర్సీ హెచ్చరించింది. విద్యాహక్కు చట్టం నిబంధనలు అమలుకు ఏయే చర్యలు తీసుకున్నారో 30రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి