వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. జనగణమన కంటే ముందే వందేమాతరం ఆలాపన
ABN , Publish Date - Feb 11 , 2026 | 08:31 PM
జాతీయ గేయం వందేమాతరం ఆలాపనపై కేంద్రం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇకనుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం అలపించాలి.
న్యూఢిల్లీ: జాతీయ గేయం వందేమాతరం ఆలాపనపై కొత్త నిబంధనలను కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఇకనుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన (Jana Gana Mana) కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం (Vande Mataram) అలపించాలి. అధికారిక కార్యక్రమాలు, వేడుకల్లో తొలుత 3 నిమిషాల 10 సెకన్ల పాటు వందేమాతరం 6 చరణాలను ఆలపించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ప్రకటించిన వందేమాతరం కొత్త ప్రోటోకాల్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ నిబంధనల ప్రకారం, వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. పౌర పురస్కారాలు, రాష్ట్రపతి, గవర్నర్లు పాల్గొనే అన్ని కార్యక్రమాల్లోనూ వందేమాతరం ఆలపించాలి. సినిమా హాళ్లలో దీన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. జాతీయ గీతం, జాతీయ గేయం ఆలపించేటప్పుడు అంతరాయం కలిగిస్తే బాధ్యులకు మూడేళ్ల వరకూ జైలుశిక్ష పడుతుంది. స్కూళ్ల కార్యక్రమాలు తప్పకుండా వందేమాతరం కార్యక్రమంతో మొదలు కావాలి. ఇందుకోసం పాఠశాలల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలి. కాగా, ప్రత్యేక కార్యక్రమాలు, వేడకల్లో వందేమాతరం ఆలాపన చేయాలని అనుకుంటే తగిన ఆడియో సిస్టమ్ను సమకూర్చుకోవాలి. అవసరమైతే గేయం ఆలాపనకు వీలుగా ఆరు చరణాలతో కూడిన కరపత్రాలను కార్యక్రమానికి హాజరైన వారికి పంపిణీ చేయవచ్చు.
దేశభక్తి, మాతృభూమిపై ప్రేమతో మర్యాదపూర్వకంగా సముచితమైన పద్ధతిలో ఏ కార్యక్రమంలో నైనా వందేమాతరం ఆలపించవచ్చని కేంద్రం తెలిపింది. వందేమాతర గేయం 150 వసంతాల వేడుకలను కేంద్ర నిర్వహిస్తున్న వేళ ఈ మార్గదర్శకాలను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
రాహుల్పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తాం.. కిరణ్ రిజిజు
ఎప్స్టీన్ను కలిసాను కానీ.. రాహుల్ ఆరోపణలపై హర్దీప్ సింగ్ పూరి