నేపాల్ వరదలు.. కళ్లెదుటే బురద నీటిలో భార్య కొట్టుకుపోవడంతో..
ABN , Publish Date - Sep 01 , 2026 | 08:37 PM
నేపాల్ను వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఎటుచూసినా బీభత్సమే కనిపిస్తోంది. వరద బాధితులైన ఒక్కో కుటుంబానిది ఒక్కో కన్నీటి గాథ. తాజాగా భార్యను కోల్పోయిన ఓ భర్త చెప్పిన కన్నీటి గాథ నేపాల్లో విషాదానికి అద్దం పడుతోంది.
ఖాఠ్మాండూ: నేపాల్ను వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఎటుచూసినా బీభత్సమే కనిపిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా మృతి చెందగా.. 4 వేల మందికి పైగా గల్లంతయ్యారు. వరద బాధితులైన ఒక్కో కుటుంబానిది ఒక్కో కన్నీటి గాథ. ఏ కుటుంబాన్ని కదిలించినా తమ వారిని కోల్పోయిన బాధలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులను కళ్ల ముందే కోల్పోయిన విషయాన్ని వెల్లడిస్తూ రోదిస్తున్నారు. తాజాగా భార్యను కోల్పోయిన ఓ భర్త చెప్పిన కన్నీటి గాథ నేపాల్లో విషాదానికి అద్దం పడుతోంది.
ఆగస్టు 26న నేపాల్లోని రసువా జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం గోసైంకుండకు బద్రీ ప్రసాద్ దేవ్కోటా తన భార్యతో కలిసి వెళ్తున్నాడు. ఆ దంపతులు ప్రయాణిస్తున్న బస్సులో మొత్తం 36 మంది ఉన్నారు. అయితే, వారిపై ఒక్కసారిగా వరద విరుచుకుపడింది. భారీగా ముంచుకొస్తున్న బురద నీటిని బద్రీ ప్రసాద్ ముందుగానే గమనించాడు. వారి వాహనం వేగంగా ప్రయాణిస్తుండగా భార్య చేయి పట్టుకుని బస్సు నుంచి దూకుదామని చెప్పాడు. అయితే, ఆయన భార్య మాత్రం అందుకు నిరాకరించింది. బస్సు నుంచి దిగొద్దని భర్తను కోరింది. వరదనీరు బస్సును ముంచేస్తుందని, అక్కడే ఉంటే ఇద్దరం చనిపోతామని అతను చెప్పినా ఆమె వినలేదు. దీంతో చివరకు బద్రీ ప్రసాద్ భార్య చేతిని విడిపించుకుని కదులుతున్న బస్సు నుంచి బయటకు దూకేశాడు.
బస్సు నుంచి దూకిన వెంటనే బద్రీ ప్రసాద్ను భీకరమైన వరద ప్రవాహం ఈడ్చుకెళ్లింది. ఆ ప్రవాహానికి ఆయన ఓ మురుగు కాలువలోకి కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తూ కొండ వాలుపై ఉన్న చెట్లను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ తన కళ్ల ముందే మరో ఘోరం జరిగింది. తన భార్య ప్రయాణిస్తున్న బస్సు వరద నీటిలో పూర్తిగా మునిగిపోవడాన్ని ఆయన కళ్లారా చూశాడు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను అధికారులు గుర్తించగా.. మరో 28 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారిలో బద్రీ ప్రసాద్ భార్య కూడా ఉన్నారు. వరద ప్రవాహంలో బస్సు కొట్టుకుపోయి పూర్తిగా మునిగిపోయిన పరిస్థితిని చూస్తే గల్లంతైన వారి ప్రాణాలపై తీవ్ర ఆందోళన నెలకొంది. అయినప్పటికీ బద్రీ ప్రసాద్ తన భార్య కోసం గాలిస్తూనే ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్కు బెదిరింపు లేఖ
అసదుద్దీన్ ఒవైసీకి షాక్..!.. పక్క చూపులు చూస్తున్న ఏఐఎంఐఎం సీనియర్ నేత..