Share News

యూపీఎస్‌సీని చూసి నేర్చుకోండి.. నీట్ పేపర్ లీక్‌పై ‘సుప్రీం’ వ్యాఖ్య

ABN , Publish Date - May 29 , 2026 | 04:49 PM

నీట్‌ పేపర్ లీక్ ఉదంతంపై విచారణ చేట్టిన సుప్రీం కోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ‌పై(ఎన్‌టీఏ) పలు ప్రశ్నలు సంధించింది. ఇన్ని నిఘా వ్యవస్థలు, కమిటీలు ఉన్నా పేపర్ ఎలా లీకైందని ప్రశ్నించింది.

యూపీఎస్‌సీని చూసి నేర్చుకోండి.. నీట్ పేపర్ లీక్‌పై ‘సుప్రీం’ వ్యాఖ్య
Supreme Court Hearing on Neet Paper Leak

ఇంటర్నెట్ డెస్క్: నీట్‌ పేపర్ లీక్ ఉదంతంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ‌పై(ఎన్‌టీఏ) పలు ప్రశ్నలు సంధించింది. ఇన్ని నిఘా వ్యవస్థలు, కమిటీలు ఉన్నా పేపర్ ఎలా లీకైందని ప్రశ్నించింది. సివిల్స్ పరీక్షలు నిర్వహించే యూపీఎస్‌సీ‌లో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ వెలుగుచూడలేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. యూపీఎస్‌సీని చూసి నేర్చుకోవాలని ఎన్‌టీఏకు సూచించింది.

కోర్టు విచారణకు ఎన్‌టీఏ తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. నీట్ వ్యవస్థ ప్రక్షాళనకు ఏర్పాటైన హైలెవెల్ కమిటీ చైర్మన్, ఇస్రో మాజీ చీఫ్ డా. రాధాకృష్ణన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌టీఏ, డా. రాధాకృష్ణన్ దాఖలు చేసిన అఫిడవిట్‌లను సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. కేంద్రం తన ఎఫిడవిట్ దాఖలు చేసేందుకు న్యాయస్థానం అదనపు గడువు ఇచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నరసింహ మాట్లాడుతూ పేపర్ లీక్‌కు ఆస్కారం కల్పించిన పరిస్థితులు ఏమిటని డా. రాధాకృష్ణన్‌ను ప్రశ్నించారు. గతంలో అనేక రక్షణలను ఏర్పాటు చేసినా పేపర్ ఎలా లీక్ అయ్యిందని అన్నారు.


ఇందుకు డా. రాధాకృష్ణన్ బదులిస్తూ పేపర్ సెట్టింగ్ ప్రక్రియలో సమస్య తలెత్తిందని అన్నారు. ప్రస్తుతం ఆ లోపాలనూ సరిదిద్ది వ్యవస్థను మరింత బలోపేతం చేశామని అన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా గతంలో మొత్తం 101 సూచనలు చేశామని చెప్పారు. వాటిల్లో 60 తాత్కాలిక సూచనలను 2025-26 పరీక్ష కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు చెప్పారు. ఇతర మార్గదర్శకాలు కూడా త్వరలో పూర్తిస్థాయిలో అమలవుతాయని చెప్పారు. మరోసారి ఇలాంటివి జరగవని ధీమా వ్యక్తం చేశారు. సంస్కరణలే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

కేవలం సంస్కరణలతో పరిస్థితి చక్కబడదని కోర్టు వ్యాఖ్యానించింది. తప్పు జరిగినప్పుడు బాధ్యత ఎవరిదనే దానిపై స్పష్టత ఉండాలని పేర్కొంది. బాధ్యత ఎవరు తీసుకుంటారనేది తేల్చకుండా ఎన్ని కమిటీలు, మీటింగ్‌లు ఏర్పాటు చేసిన ఫలితం ఉండదని వ్యాఖ్యానించింది.

ఇక ఈ అంశంపై సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ పేపర్ లీక్‌పై విచారణ జరుగుతోందని అన్నారు. జూన్ 21న నిర్వహించనున్న పరీక్ష కోసం కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. ప్రధాని స్వయంగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారని కోర్టుకు తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలపై పిటిషన్.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

జూన్ 1న డీకే ప్రమాణస్వీకారం.. సిద్ధరామయ్య తనయుడికి డిప్యూటీ సీఎం!

Updated Date - May 29 , 2026 | 05:15 PM