రేపు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. హాజరుకానున్న కూటమి ఎంపీలు
ABN , Publish Date - Feb 02 , 2026 | 09:41 PM
న్యూఢిల్లీలో రేపు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని, ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే కూటమి సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: పార్లమెంట్ సమావేశాలకు మధ్యలో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక సమావేశానికి సిద్ధమవుతున్నారు. రేపు (ఫిబ్రవరి 3) ఉదయం 9:30 గంటలకు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. యూనియన్ బడ్జెట్ 2026, విక్సిత్ భారత్@2047 విజన్, పార్లమెంట్లో ప్రభుత్వ అజెండా వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని, ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే కూటమి సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. ఈ సమావేశానికి బీజేపీ, టీడీపీ, జనసేన, జేడీ(యూ), ఎల్జేపీ(ఆర్), శివసేన, జేడీ(ఎస్) తదితర ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరవుతారు.
సమావేశంలో ఏమి చర్చించనున్నారు?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఫీచర్లు, ముఖ్య అంశాలను ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తారు.
పార్లమెంట్లో ప్రభుత్వ బిల్లులు, లెజిస్లేటివ్ ప్రయారిటీలు, ఆర్థిక విధానాలు, గవర్నెన్స్ అంశాలపై చర్చ.
ప్రధాన మంత్రి మోదీ ప్రసంగంలో పొలిటికల్, గవర్నెన్స్ ఇష్యూస్, పార్లమెంటరీ అజెండాపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది.
హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ తదితర కీలక నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు.
ఈ సమావేశం బడ్జెట్ సెషన్ మధ్యలో జరుగుతుండటం విశేషం. ఇటీవల లోక్సభలో రాహుల్ గాంధీ.. చైనా అంశంపై చేసిన కామెంట్లు, సభ వాయిదా పడిన నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలు ఏకతాటిపై ఉండాలని, బడ్జెట్ చర్చల్లో బలంగా మాట్లాడాలన్నది ఈ మీటింగ్ ఉద్దేశ్యంగా సమాచారం.