జాబిల్లిపై స్థావరం ఏర్పాటు చేద్దాం రండి!
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:16 AM
చంద్రుడిపై అన్వేషణ, మానవ అంతరిక్ష యానంలో భారత్-అమెరికా సహకారానికి సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రణాళికలో...
‘మూన్ బేస్’ మిషన్లో పాల్గొనాలని ఇస్రోకు నాసా ఆహ్వానం
బెంగళూరు, ఆగస్టు 11: చంద్రుడిపై అన్వేషణ, మానవ అంతరిక్ష యానంలో భారత్-అమెరికా సహకారానికి సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రణాళికలో భారత్ కూడా భాగస్వామి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం తాము చేపడుతున్న ప్రతిష్ఠాత్మక ‘మూన్ బేస్’ మిషన్లో భాగస్వామి కావాలంటూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను అధికారికంగా ఆహ్వానించింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5, 6 తేదీల్లో జరిగిన భారత్-అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చింది. ఈ సమావేశంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్, భారత్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ పాల్గొన్నారు. ఆర్టెమిస్ ఒప్పందాల కింద ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ.. నాసా తన మూన్ బేస్ కార్యక్రమంలో చేరాల్సిందిగా ఇస్రోను ఆహ్వానించినట్టు అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది. ఈక్రమంలో శాస్ర్తీయ డేటాను పంచుకునే అంశంపై చర్చలు ముందుకు తీసుకెళ్లేందుకు ఇరుదేశాలూ అంగీకరించాయని పేర్కొంది. భారత్ తన స్పేస్ విజన్-2047 లక్ష్యంలో భాగంగా చంద్రుడిపై మానవ కార్యకలాపాలకు సిద్ధమవుతున్న తరుణంలో నాసా నుంచి ఈ ఆహ్వానం అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహ ప్రయోగం ద్వారా ఇప్పటికే ఇరు దేశాలు అంతరిక్ష సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనలు, మానవ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన సాంకేతికతపై కలిసి పనిచేయాలని తాజాగా నిర్ణయించాయి.
ఇవి కూడా చదవండి
భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్
నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్