Share News

కాంగ్రెస్ అభ్యర్థికి మమతా బెనర్జీ మద్దతు.. ఇంతలోనే అరెస్టు

ABN , Publish Date - Sep 18 , 2026 | 07:25 PM

త్వరలో నందీగ్రామ్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థికి మమతా బెనర్జీ మద్దతు.. ఇంతలోనే అరెస్టు
Milan Pradhan Arrest

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో నందీగ్రామ్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. 2007 నాటి భూసేకరణ వ్యతిరేక నిరసనల కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నందీగ్రామ్ ఉపఎన్నికలో తమ వర్గం కాంగ్రెస్ నేత మిలన్‌కు మద్దతు ఇస్తుందని మమతా బెనర్జీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే మిలన్ అరెస్టు కావడం కలకలానికి దారి తీసింది. 2007 నాటి నిరసనల్లో 14 మంది గ్రామస్థులు మరణించిన విషయం తెలిసిందే.

అంతకుముందు మమతా బెనర్జీ మాట్లాడుతూ తాము కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా మమత వర్గానికి చెందిన సంచితా ప్రధాన్ డే కూడా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. బీజేపీపై పోరాడుతున్న INDIA కూటమికి సంఘీభావంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం తెలిపారు.


ఇదిలా ఉంటే, టీఎంసీలో చీలిక నేపథ్యంలో పార్టీ పేరును, గుర్తును నేడు ఈసీ స్తంభింపజేసింది. వచ్చే ఉపఎన్నికలో మమతా బెనర్జీ వర్గానికి మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరును ఖరారు చేసింది. ఫుట్ బాల్ ప్లేయర్ గుర్తును ఈసీ వారికి కేటాయించింది. మరోవైపు, టీఎంసీ రెబల్ వర్గానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ పేరును ఈసీ ఖరారు చేసింది. ఎన్వలప్ సింబల్‌ను తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించింది. రాబోయే ఉపఎన్నికకు ఈ మార్పులు వర్తించనున్నాయి. ఈ పరిణామాలపై మమతా స్పందించారు. ఇదో చీకటి దినమని విమర్శించారు.


ఈ వార్తలనూ చదవండి:

అమెజాన్ రిటర్న్ పాలసీతో భారీ మోసం.. వ్యాపారికి రూ.16.28 లక్షల నష్టం

TRAI కొత్త రూల్స్.. స్పామ్ కాల్స్‌, మెసేజ్‌లకు శాశ్వత పరిష్కారం!

Updated Date - Sep 18 , 2026 | 08:45 PM