BMC Elections: ముంబై మున్సిపల్ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏంటంటే..
ABN , Publish Date - Jan 15 , 2026 | 07:51 PM
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-శివసేన (షిండే) కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 130 సీట్లకుపైగా కైవనం చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ముంబై మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ మొదలైంది. ఎగ్టిట్ పోల్స్ మాత్రం బీజేపీ-శివసేన (ఏక్నాథ్ షిండే) కూటమి గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి (BMC Elections Exit Polls)
బీజేపీ-శివసేన కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని యాక్సిస్ మై ఇండియాతో పాటు జేవీసీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ-శివసేన కూటమికి 138 సీట్లు దక్కుతాయని జేవీసీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలో తేలింది. శివసేన (యూబీటీ) - ఎమ్ఎన్ఎస్ (రాజ్థాకరే) కూటమి 59 సీట్లతో సరిపెట్టుకుటుందనే అంచనాకు వచ్చింది. కాంగ్రెస్కు 23 సీట్లు దక్కవచ్చని తెలిపింది. ఇక యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీజేపీ-శివసేన కూటమికి 131-151 సీట్ల మధ్య దక్కే ఛాన్స్ ఉంది. శివసేన(యూబీటీ)-ఎమ్ఎన్ఎస్ కూటమికి 58-68 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్కు 20 సీట్లకు మించి రాకపోవచ్చని కూడా యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది.
బీజేపీ-శివసేన 119 సీట్లల్లో గెలిచే అవకాశం ఉందని సకల్ పోల్ అంచనా వేసింది. శివసేన(యూబీటీ)-ఎమ్ఎన్ఎస్ కూటమికి 75 సీట్లు, కాంగ్రెస్కు గరిష్ఠంగా 20 సీట్లు రావొచ్చని అంచనా వేసింది.
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో 1985 నుంచి థాకరేల సారథ్యంలోని శివసేన (అవిభాజ్య) ఆధిపత్యం కొనసాగిస్తోంది. అయితే, ఈసారి మాత్రం ఏక్నాథ్ షిండే వర్గం వైపు ప్రజలు మళ్లే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 227 వార్డులు ఉన్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 137 సీట్లల్లో, శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) 90 స్థానాల్లో బరిలోకి దిగాయి. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) ఒంటరిగానే బరిలో నిలిచింది. ఇక ఎన్సీపీ (శరత్చంద్ర పవార్ వర్గం), ఎమ్ఎన్ఎస్లతో కలిసి శివసేన (యూబీటీ) ఎన్నికల్లో పాల్గొంది. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ పడింది.
ఇవీ చదవండి:
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..
మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు