Share News

దారుణం.. 14 ఏళ్ల కూతుర్ని రూ. 2 లక్షలకు అమ్మేసిన తల్లి ..

ABN , Publish Date - Feb 11 , 2026 | 07:54 AM

అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి 2 లక్షల రూపాయలకు కూతుర్ని అమ్మేసింది. 14 ఏళ్ల తన కూతురిని 54 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది.

దారుణం.. 14 ఏళ్ల కూతుర్ని రూ. 2 లక్షలకు అమ్మేసిన తల్లి ..
mother sells minor daughter

ఇంటర్‌నెట్ డెస్క్: ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. 2 లక్షల రూపాయలకు కూతుర్ని అమ్మేసింది. 14 ఏళ్ల తన కూతురిని 54 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పుంగనూరులోని బీడీ కాలనీకి చెందిన రామరాజు, శోభ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. గత కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2 నెలల క్రితం శోభ భర్తతో గొడవపడి ఇంటినుంచి వెళ్లిపోయింది.


రెడ్డప్ప అనే మధ్యవర్తి ద్వారా 14 ఏళ్ల పెద్ద కూతురిని శోభ అమ్మడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కర్ణాటకలోని రాయల్పాడుకు చెందిన 54 ఏళ్ల రెడ్డి రాజశేఖర్‌తో రెడ్డప్ప బేరం కుదిర్చాడు. శోభకు 2 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు రాజశేఖర్ మొదట 50 వేల రూపాయలు ఇచ్చాడు. 10 రోజుల క్రితం బెంగళూరులో బాలికను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. పెళ్లి తర్వాత రాజశేఖర్ బాలికను ఇబ్బంది పెట్టసాగాడు. దీంతో తట్టుకోలేకపోయిన బాలిక చిన్నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పింది.


తర్వాత చిన్నాన్న సాయంతో పుంగనూరు చేరుకుంది. ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలో జరిగిన ఘటన కావటంతో పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాలికకు రక్షణ కల్పించేలా ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఇక, ఈ సంఘటనపై జిల్లా యంత్రాంగం సీరియస్ అయింది. ఐసీడీఎస్ అధికారుల చేత విచారణ చేపట్టింది. అధికారులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలిక చదువుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బాలిక తల్లి శోభ మాట్లాడుతూ.. ‘భర్తతో మనస్పర్థల వల్ల ఇంటినుంచి బయటకు వచ్చేశాను. తెలిసో తెలియకో తప్పు చేశాను. రెడ్డప్ప నమ్మించి మోసం చేశాడు’ అని చెప్పుకొచ్చింది.


ఇవి కూడా చదవండి

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

అమెరికా-బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్.. భారత్‌కు ఇబ్బందేనా..

Updated Date - Feb 11 , 2026 | 09:27 AM