Share News

మార్గదర్శికి సుప్రీంలో ఊరట!

ABN , Publish Date - Aug 21 , 2026 | 07:00 AM

మార్గదర్శి ఫైనాన్షియర్‌ ్సకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిపాజిట్ల వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది...

మార్గదర్శికి సుప్రీంలో ఊరట!

  • మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్‌ కొట్టివేత

  • హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు

  • పిటిషన్‌ వేయడానికి ఉండవల్లి ఎవరు?

  • తీర్పు సందర్భంగా సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి ఫైనాన్షియర్‌ ్సకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిపాజిట్ల వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మార్గదర్శిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును 19 డిసెంబరు 2025న ఉండవల్లి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ గురువారం జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఉండవల్లి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మార్గదర్శి ఫైనాన్సియర్‌ ్స ఎలాంటి అనుమతులు లేకుండా, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి రూ.2,500 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసిందని ప్రస్తావించారు. గతంలో హైకోర్టు ఆర్బీఐ వాదనలను విస్మరించిందని, కేవలం సాంకేతిక కారణాలను చూపుతూనే కేసును కొట్టివేసిందని తెలిపారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌ 45ఎస్‌ ప్రకారం హెచ్‌యూఎ్‌ఫ అనేది ‘అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌’ కిందకు వస్తుందని, క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ముగిసిపోవని ఆర్బీఐ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా రూ.5.23 కోట్లకు పైగా చెల్లింపులు మిగిలి ఉన్నాయని, కొందరు పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడం వల్లే ఇది పెండింగ్‌లో పడిందని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మార్గదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్ర వాదనలు వినిపిస్తూ.. ఇప్పటి వరకు డిపాజిటర్లకు సంబంధించి రూ.2,500 కోట్లు తిరిగి ఇచ్చేసినట్లు వివరించారు. ఎవరూ క్లెయిమ్‌ చేయని మిగిలిన రూ.5.23 కోట్లను నిబంధనల ప్రకారం ఎస్ర్కో ఖాతాలో జమ చేశామనిచెప్పారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తెలంగాణ హైకోర్టు వ్యవహరించిందని, పబ్లిక్‌ నోటీసు జారీ చేసి, తదుపరి ప్రక్రియ అంతటినీ పారదర్శకంగా నిర్వహించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఉండవల్లి తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై పిటిషన్‌ వేయడానికి, పోరాటం చేయడానికి ఉండవల్లి ఎవరని ప్రశ్నించింది. ఈ కేసు వివరాలన్నీ పరిశీలిస్తే ఇది మీ వ్యక్తిగత వివాదంగా కనిపిస్తోంది తప్ప ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజనాలు గానీ, ఇతర అంశాలు గానీ కనిపించడం లేదని అభిప్రాయపడింది. ఈ కేసులో ఉండవల్లి తరఫున వాదించే కొద్దీ ఆయనపైనే అనుమానాలు పెరుగుతున్నాయంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఉండవల్లి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 07:02 AM