గత ఏడాది ప్రయత్నించాడు.. ఈ ఏడాది ప్రాణం పోయింది..
ABN , Publish Date - Aug 23 , 2026 | 08:17 PM
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కునాల్ కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఐఫోన్ ఈఎమ్ఐ కాదని తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కునాల్ కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఐఫోన్ ఈఎమ్ఐ కాదని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత ఏడాది ఇదే కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి కునాల్ ప్రయత్నించాడు. అప్పుడు పోలీసులు నచ్చజెప్పటంతో అతడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించాడు.
ఈ సారి ఎవరు ఎంత చెప్పినా కునాల్ వినలేదు. కొండ మీదనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. కునాల్ను కాపాడే ప్రయత్నంలో తండ్రి మురళీధర్ కొండపైనుంచి కిందపడ్డాడు. ఇద్దరూ చనిపోవటంతో తల్లి సంగీత కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కునాల్ మరణానికి కుటుంబ సమస్యలే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆరు సంవత్సరాల క్రితం సంగీత, మురళీధర్ పెద్ద కుమారుడు అనారోగ్యంతో మరణించినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. డ్రైవర్గా పనిచేస్తున్న మురళీధర్ నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండేవాడు.
కొన్ని నెలల క్రితం క్యాంపునకు వెళ్లిన మురళీధర్ ఘటన జరగడానికి రెండు రోజుల ముందు ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు జరిగాయి. శుక్రవారం ఖవడ్యా కొండ మీద నుంచి దూకి కునాల్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తల్లి సంగీత అతడిని ఎంతో బతిమాలింది. ‘అమ్మా.. ఎవ్వరూ నా మాట వినలేదు. నాకు బతకాలన్న ఆసక్తిలేదు. నా సమస్యలకు పరిష్కారం లేదు. నా జీవితం మెరుగుపడుతున్న నమ్మకం కూడా లేదు’ అని చెప్పి, కునాల్ కొండమీద నుంచి ప్రాణాలు తీసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
రిషభ్ పంత్ గాయంపై టీమిండియా కోచ్ కీలక అప్డేట్
తుర్కియే మిలిటరీ విమానాల్లో డ్రోన్స్ తరలింపు?