20 మంది పిల్లల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయిన అంగన్వాడీ ఆయా
ABN , Publish Date - Feb 04 , 2026 | 10:06 AM
ఓ అంగన్వాడీ ఆయా తేనెటీగల దాడి నుంచి 20 మంది పిల్లల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయింది. ధీరత్వానికి ప్రతీకగా నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడి నుంచి 20 మంది పిల్లల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయింది ఓ అంగన్వాడీ ఆయా. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నీమచ్ జిల్లా రన్పూర్ గ్రామంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో కాంచన్ బాయ్ మేఘావల్ ఆయాగా పని చేస్తోంది. మంగళవారం ఉదయం అంగన్వాడీ సెంటర్లో పిల్లల కోసం కాంచన్ వంట వండుతూ ఉంది. పిల్లలు అంగన్వాడీ బయట ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్నారు.
ఎక్కడినుంచి వచ్చాయో తెలీదు కానీ భారీ సంఖ్యలో తేనెటీగలు పిల్లలు ఉన్న చోటుకు వచ్చాయి. ఒక్కసారిగా పిల్లల మీద దాడి చేయటం మొదలెట్టాయి. వారి అరుపులు విన్న కాంచన్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సాయం చేయడానికి వెళ్లింది. అక్కడ ఉన్న టార్పాలిన్లు, చాపలను తీసుకెళ్లి కొంతమంది పిల్లలకు కప్పింది. మిగిలిన వారికి తన శరీరాన్ని అడ్డుగా పెట్టి.. అక్కడినుంచి అంగన్వాడీ సెంటర్లోకి తీసుకువచ్చింది. తేనెటీగలు వారిని కుట్టకుండా రక్షణగా నిలిబడింది. దీంతో అవి ఆమె మీద విచక్షణా రహితంగా దాడి చేయసాగాయి.
ఆమె మాత్రం పక్కకు కదలలేదు. కొద్దిసేపటి తర్వాత గ్రామస్తులు అక్కడికి వచ్చారు. తేనెటీగలను అక్కడినుంచి తరిమివేశారు. కాంచన్ వెంటనే నేలపై కుప్పకూలిపోయింది. కాలూనాథ్, రాజేశ్ రాథోర్లు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా, కాంచన్ మృతితో కుటుంబం దిక్కులేనిది అయిపోయింది. కాంచన్ భర్త శివ్లాల్ అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో మంచానికి పరిమితం అయ్యాడు. భర్త, ముగ్గురు పిల్లలను కాంచన్ తన రెక్కల కష్టంతో పోషిస్తోంది. తేనెటీగల కారణంగా కాంచన్ మరణించటంతో నలుగురు కుటుంబసభ్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఇవి కూడా చదవండి
8న భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన