కేబీసీలో రూ. 50 లక్షలు గెలిచి.. రూ. 2.5 కోట్ల స్కామ్లో అరెస్టై..
ABN , Publish Date - Mar 27 , 2026 | 02:52 PM
‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోలో పాల్గొని ఏకంగా 50 లక్షల రూపాయలు గెలుచుకున్న ఓ మహిళా తహసీల్దార్.. 2.5 కోట్ల రూపాయల స్కామ్లో జైలుపాలయ్యారు. మధ్య ప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అమితాబ్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ షోలో పాల్గొని ఏకంగా 50 లక్షల రూపాయలు గెలుచుకున్న ఓ మహిళా తహసీల్దార్.. 2.5 కోట్ల రూపాయల స్కామ్లో జైలుపాలయ్యారు. మధ్య ప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన అమితా సింగ్ తోమర్ విజయ్పుర్ తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2021లో విజయ్పుర్ ఏరియాలో వరదలు వచ్చినపుడు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ను అమితా సింగ్తో పాటు మరికొంత మంది దోచేశారు.
2.5 కోట్ల రూపాయలను ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాటికి పంపించుకున్నారు. ఈ స్కామ్పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మొత్తం 110 మందిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో అమితా సింగ్ నేరం చేసినట్లు తేలింది. బుధవారం కలెక్టర్ ఆర్పితా వర్మా అమితా సింగ్ను తహసీల్దార్ పదవి నుంచి తీసేశారు. గురువారం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు 22 మంది రెవెన్యూ అధికారులను కూడా అరెస్ట్ చేశారు.
ఈ సంఘటనపై గ్వాలియర్ ఎస్పీ మాట్లాడుతూ.. ‘అమితా సింగ్ గత కొన్ని రోజుల నుంచి డ్యూటీకి వెళ్లటం లేదు. అజ్ణాతంలో ఉన్న అమితా సింగ్ను పోలీసులు ట్రేస్ చేసి గ్వాలియర్లో అరెస్ట్ చేశారు’ అని తెలిపారు. కాగా, అమితా సింగ్ తోమర్ కొన్నేళ్ల క్రితం కౌన్ బనేగా కరోడ్ పతీ షోలో పాల్గొన్నారు. ఏకంగా 50 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. ఎంతో తెలివైన ఆమె ఇలా అవినీతి కేసులో జైలు పాలవ్వటం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
గ్యాస్ ఎఫెక్ట్.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్
ముఖ్యమంత్రి పదవికి 30న నితీశ్ రాజీనామా