దారుణం.. పెద్దమ్మ పెదనాన్నలను ఇంజక్షన్తో చంపిన డాక్టర్..
ABN , Publish Date - Jan 21 , 2026 | 04:04 PM
ఓ డాక్టర్ తన సొంత పెద్దమ్మ పెదనాన్నలను ఇంజక్షన్తో చంపాడు. తర్వాత ఏమీ ఎరగనట్టుగా వారి మృతదేహాల వద్ద ముసలి కన్నీరు కార్చాడు. అసలేం జరిగిందంటే...
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడో వైద్యుడు. మల్లేశ్ అనే డాక్టర్.. తాను చేసిన అప్పులను తీర్చేందుకు తన సొంత పెద్దమ్మ, పెదనాన్నలను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి డాక్టర్ మల్లేశ్ అతని పెద్దమ్మ పెదనాన్న ఇంటికి వెళ్లాడు. ఒంటి నొప్పులు తగ్గేందుకు ఇంజక్షన్ ఇస్తానని నమ్మించి, ఆ సిరంజీలలో వేరే మందు ఎక్కించి ఇంజక్షన్లు ఇచ్చాడు. వాటి ప్రభావంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తర్వాత.. మల్లేశ్ ఆ ఇంట్లోని నగలు, డబ్బును తీసుకుని వెళ్లిపోయాడు. మరుసటి రోజు మృతదేహాల వద్ద ముసలి కన్నీరు కార్చాడు. కానీ, పోలీసులు.. ఆ ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారో ఆరా తీశారు. విచారించిన అనంతరం పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మల్లేశ్ హత్య చేసినట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.