జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్, విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
ABN , Publish Date - Aug 07 , 2026 | 02:01 PM
అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో తాజాగా ఊరట లభించింది. జస్టిస్ యశ్వంత్ వర్మపై కేసు నమోదు చేయాలన్న పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో తాజాగా ఊరట లభించింది. జస్టిస్ యశ్వంత్ వర్మపై కేసు నమోదు చేయాలన్న పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. న్యాయవాది ఘన్శ్యామ్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చౌకబారు పబ్లిసిటీ కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని పిటిషనర్పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయవద్దని హితవు పలికింది. ఇదే అంశంపై గతంలోనూ వచ్చిన పిటిషన్నూ కొట్టివేశామని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.
గతేడాది ఢిల్లీలోని మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం వేళ నోట్ల కట్టలు కనిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో లోక్సభలో అభిశంసన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ లోపే ఏప్రిల్ 9న జడ్జి పదవికి వర్మ రాజీనామా చేశారు. అయితే, యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేసినా నేరపూరిత బాధ్యత తొలగిపోదని ఉపాధ్యాయ్ వాదించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లాయర్ అయి ఉండి చౌకబారు ప్రచారం కోసం పిటిషన్లు వేస్తున్నారని ఆక్షేపించింది. ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసు.. సీబీఐ చార్జ్షీట్లో సంచలన విషయాలు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం