నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసు.. సీబీఐ చార్జ్షీట్లో సంచలన విషయాలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:17 PM
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ వెనుక 'యాష్ యాదవ్' కీలక పాత్ర పోషించినట్లు సీబీఐకి ఆధారాలు లభ్యమయ్యాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 7: నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. చార్జ్షీట్లోని వివరాల మేరకు.. నీట్ పేపర్ లీకేజీ వెనుక 'యాష్ యాదవ్' కీలక పాత్ర పోషించినట్లు సీబీఐకి ఆధారాలు లభ్యమయ్యాయి. యాష్ యాదవ్ విద్యార్థుల నుంచి సెక్యూరిటీగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, సైన్ చేసిన ఖాళీ చెక్కులు వసూలు చేశాడు. జైపూర్ హాస్టల్ గది నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు, సైన్ చేసిన చెక్కులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పరీక్ష జరగడానికి ముందే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. యాష్ యాదవ్ ఫోన్లోని వాట్సాప్లో పీడీఎఫ్ ఫైళ్లు, ఫోరెన్సిక్ ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితులు 'శుభమ్ మహారాష్ట్ర', 'ఏపీ బ్రోకర్' పేర్లతో సంభాషణలు సాగించారు. గురుగ్రామ్లోని యాష్ యాదవ్ ఇంట్లో లీకైన కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నల ప్రింటౌట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాసిక్కు చెందిన శుభమ్ ఖైర్నార్ ద్వారా విద్యార్థులకు లీకైన మెటీరియల్ పంపిణీ చేసినట్లు తేలింది.
నిందితులు నాసిక్ వద్ద విద్యార్థులకు వసతి ఏర్పాటు చేసి, లీకైన పేపర్లను చదివించారు. యాష్ యాదవ్ నెట్వర్క్.. ఫరీదాబాద్, జమ్మూ ప్రాంతాల్లో అభ్యర్థులకు వల వేశారు. ఆడియో రికార్డింగ్స్, వాట్సాప్ చాట్లు, సీడీఆర్ (CDR) డేటాతో పక్కా ఆధారాలను సీబీఐ అధికారులు సేకరించారు. కాగా, సీబీఐ జూలై 28వ తేదీన రౌస్ ఎవెన్యూ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. కోర్టు నిన్న (గురువారం) చార్జ్షీట్పై పరిశీలనను పూర్తి చేసి, నిర్ణయాన్ని రిజర్వ్లో ఉంచింది.
ఇవి కూడా చదవండి
గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల భారం
రెండో రోజుకు ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ.. ఐఫోన్పై లోతుగా దర్యాప్తు