ఎవరీ జితేంద్రసింగ్!
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:40 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు...
మద్యం కేసులో సంచలన
తీర్పునిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి
సీబీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తూ
ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి జితేంద్ర ప్రతా్పసింగ్ వెలువరించిన 598 పేజీల తీర్పు రాజకీయ, న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకే అక్షరజ్ఞానం లేదని.. అభూతకల్పనలు, తప్పుడు సాక్ష్యాధారాల అధారంగా తన చార్జ్షీట్ను రూపొందించిందని ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి జితేంద్ర సింగ్ లా డిగ్రీ పొందారు. ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీ్సలో సీనియర్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2024 అక్టోబరు నుంచి రౌస్ అవెన్యూ కోర్టు అదనపు సెషన్స్ జడ్జిగా కొనసాగుతున్న ఆయన.. ప్రత్యేక జడ్జి కింద అవినీతి నిరోధక చట్టానికి సంబంధించిన సీబీఐ కేసులను విచారిస్తున్నారు. జితేంద్ర సింగ్ ఎలాంటి ప్రలోభాలకు లొంగరని, చట్టం విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని పేరుపొందారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కేవలం అప్రూవర్ల ప్రకటనల ఆధారంగా సీబీఐ లాంటి సంస్థ కేసును నిర్మించినందుకు తీవ్రంగా విమర్శించారు. నిర్మాణాత్మక సాక్ష్యాలేవీ లేకుండా సీబీఐ కథలు అల్లిందని, అప్రూవర్ల మాటలనే వేదంగా భావించిందని.. ఇలా ఆధారపడడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించారు. మొత్తం సీబీఐ పరిశోధన జరిపిన తీరునే తప్పుబట్టిన జితేంద్ర సింగ్.. సీబీఐ పరిశోధనాధికారిపైనే శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించడం గమనార్హం.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ