Share News

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

ABN , Publish Date - Feb 27 , 2026 | 09:57 AM

తన ఫిన్‌టెక్ సంస్థ బ్లాక్ నుంచి 4 వేల మంది తొలగించేందుకు నిర్ణయించినట్టు సంస్థ అధినేత జాక్ డోర్సీ తెలిపారు. ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరుగుతుండటంతో సంస్థ కార్యకలాపాల్లో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు.

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
Jack Dorsey Block layoffs

ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ వ్యవస్థాపకుడు, ఫిన్‌టెక్ సంస్థ బ్లాక్ అధినేత జాక్ డోర్సీ తాజాగా కీలక ప్రకటన చేశారు. బ్లాక్ నుంచి 4 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలిపారు.

‘మా సంస్థ చరిత్రలోనే అత్యంత కఠిన నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నాము. సంస్థలో ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించేందుకు నిర్ణయించాము. ఉద్యోగుల సంఖ్య 10 వేల నుంచి 6 వేల దిగువకు చేరుతుంది. ఇందుకు సంబంధించి నా ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి.. రాబోయే నెలల్లో క్రమక్రమంగా ఉద్యోగుల్ని తొలగించడం లేదా నిజాయితీగా వెంటనే చర్యలు తీసుకోవడం. నేను రెండో మార్గాన్నే ఎంచుకున్నాను. సంస్థ ఇబ్బందుల్లో ఉన్నందుకు మేము ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. వాస్తవానికి మా కార్యకలాపాలు చక్కగా జరుగుతున్నాయి. లాభదాయకత పెరుగుతోంది. కానీ ప్రస్తుతం కంపెనీ నిర్వహణకు సంబంధించి మౌలికమైన మార్పు కనిపిస్తోంది. ఇంటెలిజెంట్ టూల్స్‌ సాయంతో తక్కువ మంది సిబ్బందితో కంపెనీని నిర్వహించే స్థాయిలో మార్పులు వస్తున్నాయి’


‘పదే పదే లేఆఫ్స్ చేపడితే సిబ్బంది మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. అందుకే ఒక్కసారిగా స్పష్టమైన రీతిలో ఈ నిర్ణయం తీసుకున్నాము’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇలాంటి నిర్ణయంతో ఎన్నో రిస్క్‌లు ఉన్నాయని తెలిపారు. అయితే, ఏ నిర్ణయం తీసుకోకపోయినా రిస్క్ తప్పదని కామెంట్ చేశారు. ఈ మార్పుల ప్రభావం సంస్థ కస్టమర్లపైనా ఉంటుందని అన్నారు. ఇంటెలిజెన్స్ టూల్స్ (ఏఐ) కేంద్రంగా సంస్థను పునర్‌నిర్మించబోతున్నట్టు తెలిపారు.

తొలగింపునకు గురైన ఉద్యోగులకు 20 వారాల పారితోషికంతో పాటు వారు కంపెనీలో పనిచేసిన కాలాన్ని బట్టి అదనపు పరిహారం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆరు నెలల పాటు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందని కూడా పేర్కొంది.


ఈ వార్తలూ చదవండి

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్ షురూ.. ఇక విదేశీ షేర్లలో నేరుగా పెట్టుబడులు

Updated Date - Feb 27 , 2026 | 10:52 AM