ఝార్ఖండ్ పేపర్ లీక్పై విద్యార్థుల నిరసనలు.. 600 మందిపై కేసు
ABN , Publish Date - Aug 13 , 2026 | 01:26 PM
ఝార్ఖండ్లో గురువారం విద్యార్థుల నిరసన కార్యక్రమానికి సంబంధించి పోలీసులు 600 మందిపై కేసు నమోదు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్లో విద్యార్థుల నిరసన కార్యక్రమానికి సంబంధించి పోలీసులు తాజాగా 600 మందిపై కేసు నమోదు చేశారు. కేసు ఎదుర్కొంటున్న వారిలో 500 మంది గుర్తు తెలియని విద్యార్థులు కూడా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పేపర్ లీక్స్ ఉదంతాలకు నిరసనగా విద్యార్థులు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమాలు ప్రస్తుతం 20వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసులు బ్యాటన్ చార్జ్ చేశారు. వాటర్ క్యానన్, భాష్పవాయువును ప్రయోగించారు. పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా మరుసటి రోజు బీజేపీ రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది.
పరీక్ష నిర్వహణ విషయంలో ప్రభుత్వం తమ డిమాండ్స్కు తలొగ్గే వరకూ నిరసనలు విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ మంచ్ ఆధ్వర్యంలో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. పరీక్ష నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీక్ ఆరోపణలు ఉన్న పలు పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. సీబీఐ లేదా ఇతర రాష్ట్రాల మాజీ జడ్జిలతో స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, విద్యార్థుల డిమాండ్స్ను ప్రభుత్వం మరో వారంలోపు నెరవేర్చకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ బుధవారం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 1200 యూనివర్సిటీల్లో తామూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్టు ఏబీవీపీ కూడా తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
సమాజంలో దళితులకు స్థానం లేదు.. ఖర్గే ఆగ్రహం
హఫీజ్ సయీద్కు మద్దతు ప్రకటించి.. భారత్పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి