Share News

మరో 25 ఏళ్లల్లో యూఎస్‌ను అధిగమించనున్న భారత్: ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్

ABN , Publish Date - Sep 13 , 2026 | 06:34 PM

మరో 25 ఏళ్లలో భారత్‌ యూఎస్‌ను అధిగమించి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రముఖ ఆర్థికవేత్త, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ శాక్స్ చెప్పారు.

మరో 25 ఏళ్లల్లో యూఎస్‌ను అధిగమించనున్న భారత్: ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్
Jeffrey Sachs

ఇంటర్నెట్ డెస్క్: మరో 25 ఏళ్లలో భారత్‌ యూఎస్‌ను అధిగమించి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రముఖ ఆర్థికవేత్త, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ శాక్స్ చెప్పారు. ప్రపంచఆర్థిక వ్యవస్థ కేంద్రంగా ఆసియా ఖండానికి మారుతుందని కూడా అన్నారు. భారత్, చైనా మధ్య బంధం మరింత బలపడాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

మరో పాతికేళ్లల్లో భారత్, చైనా దేశాలు ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా మారనున్నాయని చెప్పారు. యూఎస్ మూడో స్థానానికి దిగజారుతుందని అన్నారు. ఆ తరువాత కొనేళ్లకు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేశారు. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న భారీ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఇప్పటికే ముందుందని చెప్పారు. చైనాతో సాంకేతిక, ఆర్థిక రంగాల్లో సహకారం పెరిగితే భారత దేశ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అన్నారు. ప్రస్తుతం భారత్‌లో యువ జనాభా అధికంగా ఉండటం దేశానికి ప్రయోజనకరమని కూడా చెప్పారు.


భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక బంధం ప్రపంచంలోనే అతిముఖ్యమైనదని అన్నారు. ఇరు దేశాల మధ్య సహకారం ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప్రభావం చూపిస్తుందని చెప్పారు. అయితే, ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, విశ్వాస లోపం ఉందని కూడా ఆయన అంగీకరించారు. వీటిని పరిష్కరించుకోగలిగితే కలిగే ప్రయోజనాలు అధికమని వివరించారు. చైనాకు భారత్ అవసరం ఎంత ఉందో భారత్‌కు చైనా అవసరం కూడా అంతే ఉందని వ్యాఖ్యానించారు. చైనా సాంకేతికత, జాయింట్ వెంచర్లతో భారత్ ఆర్థికంగా మరింత విస్తరిస్తుందని చెప్పారు. చైనాతో ఆర్థికబంధం బలోపేతమైతే పాక్‌ విషయంలో భారత్‌కు ఉన్న కొన్ని ఆందోళనలు తొలగిపోతాయని చెప్పారు.


తాజా బ్రిక్స్ సమావేశంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బహుళ ధ్రువ ప్రపంచానికి రక్షణగా బ్రిక్స్ కూటమి ఉండాలని అన్నారు. కేవలం పాశ్చాత్య వ్యతిరేక గ్రూప్‌గా మిగిలిపోకూడదని సూచించారు. ఇప్పటికే బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడిందని, ఈ వాస్తవాన్ని అంతర్జాతీయ సంస్థలు, వ్యవస్థలు ప్రతిబింబించాలని అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం అమెరికా, భారత్, చైనా, రష్యా అనే నాలుగు సూపర్ పవర్స్ ఉన్నాయి. ఈ దేశాల మధ్య సహకారం మరింత పెరగాలి’ అని అన్నారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థకు కేంద్రంగా మళ్లీ ఆసియా అవతరిస్తున్న నేపథ్యంలో చైనా, ఆసియాన్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలు మరింత కీలకంగా మారతాయని చెప్పారు.


ఇక అమెరికా నేతృత్వంలోని క్వాడ్ కూటమి విషయంలో భారత్ పునరాలోచించుకోవాలని జెఫ్రీ శాక్స్ సూచించారు. ‘క్వాడ్ కూటమి చైనా వ్యతిరేకంగా ఏర్పాటైంది. ఇందులో భారత్‌ను వాడుకుంటున్నారు. క్వాడ్‌లో భారత్ భాగస్వామిగా ఉండాల్సిన అవసరమే లేదు. వెంటనే బయటకు వచ్చేయాలి. భారత్, చైనా సంబంధాలు అమెరికా చేతిలో పావుగా మారకూడదు’ అని ఆయన స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

Updated Date - Sep 13 , 2026 | 07:11 PM