7 దశాబ్దాల ఎదురుచూపుల ఫలితం! జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టుకు మోదీ అభినందనలు
ABN , Publish Date - Mar 29 , 2026 | 09:15 PM
తొలిసారిగా రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టును ప్రధాని మోదీ అభినందించారు. ఈ విజయాల పరంపర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
ఇంటర్నెట్ డెస్క్: తొలిసారిగా రంజీ ట్రోఫీ గెలుచుకున్న జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టును ప్రధాని మోదీ అభినందించారు. దాదాపు 70 ఏళ్ల ఎదురు చూపులు ఫలించాయని అన్నారు. ఇవి భావోద్వేగపూరిత క్షణాలని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ జట్టు శ్రమ, నిబద్ధతలను ఈ విజయం ప్రతిఫలిస్తోందని కామెంట్ చేశారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విషయాల్ని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ జట్టుపై ప్రశంసలు కురిపించారు. కెప్టెన్ పరాస్ డోగ్రా నాయకత్వం గొప్పదని కితాబునిచ్చారు. ఇక తన బౌలింగ్తో యావత్ దేశాన్ని ఆకట్టుకున్న బౌలర్ అకీబ్ నబీని కూడా ప్రధాని అభినందించారు. ఈ విజయం జట్టు సభ్యులకు, కోచ్కే కాకుండా యావత్ జమ్మూకశ్మీర్ ప్రజలందరికీ ఆనందం కలిగించిందని అన్నారు. యువ క్రికెటర్లకు ఈ విజయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. క్రీడలపై అక్కడి ప్రజలకు ఎంతో మక్కువ ఉందని అన్నారు.
జమ్మూకశ్మీర్ స్పోర్ట్స్ హబ్గా రూపాంతరం చెందుతోందని కూడా ప్రధాని మోదీ అన్నారు. గుల్మార్గ్ లాంటి ప్రదేశాలు ఇప్పటికే పలు ప్రధాన క్రీడాపోటీలకు ఆతిథ్యమిస్తున్న వైనాన్ని పేర్కొన్నారు. ఈ విజయాల పరంపర భవిష్యత్తులో ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ వార్తలూ చదవండి:
రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్... డీఎంకే మేనిఫెస్టో
కాంగ్రెస్ 5 గ్యారంటీలు ప్రకటించిన ఖర్గే