Share News

వాస్తవాలను దాస్తున్నారు.. కేంద్రంపై ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:56 AM

భారత దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీపై రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు.

వాస్తవాలను దాస్తున్నారు.. కేంద్రంపై ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు
Jairam Ramesh on GDP Growth Rate

ఇంటర్నెట్ డెస్క్: భారత దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీపై రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. అవన్నీ ప్రచారార్భాటమేనని కొట్టిపారేశారు. గణంకాల గారడీతో మోదీ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోందని ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. దేశంలో పెట్టుబడులు, వినియోగం మందగించాయని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం 'హై వోల్టేజ్' ధరల భారాన్ని సామాన్యులపై మోపుతోందని ఆరోపించారు. ముడిసరకుల ధరలు పెరగడంతో సామాన్యుల సొంతింటి కలలు కల్లలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరాభారం కేవలం వంటింటికే పరిమితం కాలేదని అన్నారు. రాగి వైర్ ధర రూ. 850 నుంచి రూ. 1,700 కి, అల్యూమినియం ధర రూ. 350 నుంచి రూ. 650 కి చేరిందని వెల్లడించారు.


1,000 చదరపు అడుగుల ఇంటికి వైరింగ్ ఖర్చు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయిలకు పెరిగిందని చెప్పారు. హోమ్ అప్లయన్సెస్, ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యాన్లు, సోలార్ ప్యానెళ్ల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయని అన్నారు. స్విచ్ సాకెట్లు, మెయిన్ లైన్ కేబుల్స్, టైల్స్, కార్మికులు ఖర్చు ఇలా అన్ని పెరిగాయని అన్నారు. ధరాభారం అన్ని వైపుల నుంచి ప్రజలకు షాకులిస్తోందని వ్యాఖ్యానించారు.


ఇంత జరుగుతున్నా కూడా మోదీ ప్రభుత్వం మాత్రం వాస్తవాలను మరుగున పరిచి, గణాంకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉందని మండిపడ్డారు. త్రైమాసిక జీడీపీ గణాంకాలు దేశంలోని పరిస్థితుల్ని తప్పుగా చూపిస్తున్నాయని అన్నారు. వీక్ సెంటీమెంట్‌ను ప్రతిఫలించట్లేదని చెప్పారు.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత్ ప్రగతిబాటలో దూసుకుపోతుంటే నిరాశావాదులు మాత్రం అసత్యాలను ప్రతిధ్వనిస్తున్నారని విమర్శించారు. ఈ వృద్ధి రేటు భారతీయుల సమష్టి శక్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ వృద్ధి రేటుకు కొనసాగించేందుకు భారతీయులు దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి.. విదేశాంగ శాఖ సెక్రటరీ వెల్లడి

రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Updated Date - Sep 01 , 2026 | 12:07 PM