ఈశా క్యాంపులో విషాద ఛాయలు.. సద్గురు కన్నీటిపర్యంతం
ABN , Publish Date - Aug 27 , 2026 | 03:01 PM
ఈశా ఫౌండేషన్కు చెందిన 80 మంది యాత్రికులు నేపాల్ వరదల్లో గల్లంతైన నేపథ్యంలో సంస్థలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఈశా ఫౌండేషన్కు చెందిన 80 మంది యాత్రికులు నేపాల్ వరదల్లో గల్లంతైన నేపథ్యంలో సంస్థలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సద్గురు ఫాలోవర్లు కన్నీరుమున్నీరవుతున్నారు. సాధారణంగా నవ్వుతూ కనిపించే సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా దుఃఖాన్ని అణుచుకోలేకపోయారు. కైలాశ్ యాత్ర అనంతరం ఈశా ఫౌండేషన్ యాత్రికులు టిబెట్లోని గ్యిరాంగ్ ఇమిగ్రేషన్ సెంటర్ వద్ద ఉన్న సమయంలో వరద ముంచెత్తినట్టు తెలుస్తోంది.
టిబెట్లో జరిగిందని చెబుతూ సద్గురు కన్నీటిపర్యంతమయ్యారు. గురువారం అక్కడికి వెళదామనుకున్నా కుదరలేదని చెప్పారు. గల్లంతైన వారి గురించి ఇప్పటివరకూ తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని అన్నారు. పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. గ్యిరాంగ్ ఇమిగ్రేషన్ సెంటర్లో ఈశా యాత్రికుల బృందం ఉన్న సమయంలో ఆ ప్రాంతాన్ని వరద ముంచెత్తిందని చెప్పారు. తాము ఇమిగ్రేషన్ సెంటర్కు వచ్చినట్టు ఈశా గ్రూప్ లీడర్ ప్రవీణ్ నుంచి తనకు ఉదయం 9.05 గంటలకు మెసేజీ వచ్చిందని సద్గురు చెప్పారు. ఆ తరువాత 9.14కు ఆ భవన సముదాయాన్ని వరద ముంచెత్తిందని అన్నారు.
గ్రూప్ లీడర్ ప్రవీణ్తో ఈశా ఫౌండేషన్ రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. కొన్ని క్షణాలకు తేరుకున్న ఆయన మళ్లీ మాట్లాడుతూ ప్రవీణ్ వద్ద ఉన్న నేపాల్ ఫోన్ నెంబర్ ఆ రోజంతా యాక్టివ్గా లేదని చెప్పారు. ‘ఆయన దాటి వచ్చి ఉంటే నేపాల్ ఫోన్ యాక్టివ్ అయ్యి ఉండేది. కానీ అలా జరగలేదు. అంటే, గ్రూప్ మొత్తం ఇమిగ్రేషన్ సెంటర్లోనే ఉండి ఉంటుంది’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను మరికొంత మందితో కలిసి అక్కడికి వెళ్లేందుకు భారత్, చైనాల అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
టిబెట్లో మంచుచరియలు విరిగిపడటంతో అక్కడి నదిలో పోటెత్తిన వరద దిగువ ఉన్న నేపాల్లో జలప్రయళం సృష్టించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 170 మంది మరణించగా, 1500 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో గల్లంతైన భారతీయుల్లో 100 మంది ఆచూకీ తెలిసినట్టు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
రామ్దేవ్ బాబా నా బెడ్రూమ్లో గబ్బిలంలా వేలాడుతున్నారా?.. కంగన ఘాటు వ్యాఖ్యలు
ఖేల్ కీ బాత్ పీఎం కే సాథ్.. యువ అథ్లెట్లతో ప్రధాని వర్చువల్ ఇంటరాక్షన్