ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అంత్యక్రియలు.. భారత్ తరఫున హాజరు కానున్న కేంద్ర మంత్రి!
ABN , Publish Date - Jun 29 , 2026 | 03:08 PM
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరఫున విదేశాంగ శాఖ సహాయమంత్రి పబిత్ర మార్గరీటా హాజరుకానున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరఫున విదేశాంగ శాఖ సహాయమంత్రి పబిత్ర మార్గరీటా హాజరుకానున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మంత్రి పబిత్రతో పాటు బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ కూడా వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు రావాలని ప్రధాని మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇటీవల ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో భారత్ తరఫున కేంద్ర మంత్రి, బిహార్ గవర్నర్ ఇరాన్కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయతొల్లా జన్మస్థలమైన మష్హాద్ నగరంలోనే జులై 4న ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి రోజు జరిగిన దాడిలోనే ఖమేనీ కన్నుమూశారు. దాదాపు 36 ఏళ్ల పాటు ఆయన ఇరాన్ను ముందుండి నడిపించారు. ఖమేనీ స్మృత్యర్థం కోమ్ నగరంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఖమేనీ అంత్యక్రియలపై తొలి నుంచీ కొంత సందిగ్ధత నెలకొంది. జూన్లో అంత్యక్రియలు పూర్తవుతాయని మొదట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే, జులైలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వ మీడియా ఇటీవల ధ్రువీకరించింది.
అంత్యక్రియలకు దాదాపు 20 మిలియన్ల మంది హాజరుకానున్నట్టు ఇరాన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఇరాన్కు వెళ్లే అవకాశం ఉంది. ఇక అయతొల్లా ఖమేనీ అనంతరం ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నారు. అయితే, ఆయన ఎక్కడున్నారనే దానిపై స్పష్టత లేదు. మొజ్తాబా ఆరోగ్యంపై కూడా పలు వార్తలు వెలువడ్డాయి. ఆయన కోమాలో ఉండే అవకాశం ఉందని సీనియర్ యూఎస్ అధికారులు పలుమార్లు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
జైపుర్లో విషాదం.. గోడ కూలడంతో ముగ్గురు కార్మికుల మృతి
గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్కు పునాది: శివరాజ్సింగ్