ఇస్రో ప్రైవేటీకరణ జరగదు
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:34 AM
ఇస్రో ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని, ప్రైవేటీకరణ జరగబోదని ఆ సంస్థ చైర్మన్ వి నారాయణన్ స్పష్టం చేశారు. దేశ అంతరిక్ష వ్యవస్థను విస్తరించేందుకే ప్రైవేటు కంపెనీలు, స్టార్ట్పలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు.
అంతరిక్ష వ్యవస్థ విస్తరణకే ప్రైవేటుతో భాగస్వామ్యం.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: ఇస్రో చైర్మన్
బెంగళూరు, సెప్టెంబరు 7: ఇస్రో ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని, ప్రైవేటీకరణ జరగబోదని ఆ సంస్థ చైర్మన్ వి నారాయణన్ స్పష్టం చేశారు. దేశ అంతరిక్ష వ్యవస్థను విస్తరించేందుకే ప్రైవేటు కంపెనీలు, స్టార్ట్పలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగుల ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. తయారీ, నిర్వహణ విధులను ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై అధికారిక వివరణ కోరుతూ ఈ నెల 4న తొమ్మిది ఉద్యోగ సంఘాలు ఇస్రో చైర్మన్కు లేఖరాసిన నేపథ్యంలో నారాయణన్ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. సోమవారం ‘బెంగళూరు స్పేస్ ఎక్స్పో’(బీఎ్సఎక్స్) ప్రారంభోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత అంతరిక్ష కార్యక్రమాలకు సుమారు 65 ఏళ్ల చరిత్ర ఉందని, ప్రస్తుతం దేశంలోని సామాన్య ప్రజలకు సేవలందిస్తున్న 56 ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉన్నాయని చెప్పారు. ఇంకా వీటి అవసరం భారీ సంఖ్యలోనే ఉందన్నారు. ఆరేళ్ల క్రితమే అంతరిక్ష రంగంలో సంస్కరణలు మొదలైన విషయాన్ని నారాయణన్ గుర్తుచేశారు. ప్రైవేటు రంగం, స్టార్ట్పలకు చేయూతనిస్తూ అంతరిక్ష రంగ వ్యవస్థను మరింత వృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. ‘పీఎ్సఎల్వీ లేదా జీఎ్సఎల్వీ ప్రయోగాలు జరిగినప్పుడల్లా దాదాపు 80ు బడ్జెట్ మన దేశంలోని స్థానిక సంస్థలు, పరిశ్రమలకే వెళ్తున్నాయి. ఇస్రో కోసం మొత్తం 450 పరిశ్రమలు పనిచేస్తున్నాయి’ అని చెప్పారు.
రాజీనామాలు సహజమే..
ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ఆందోళనల గురించి ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగులు లేవనెత్తిన ఆందోళనల్లో వాస్తవం లేకపోలేదు. వాటిపై స్పష్టత ఇవ్వడం మా బాధ్యత. ఇస్రో అనేది ప్రభుత్వ పెట్టుబడితో నడుస్తున్న సంస్థ. మేం ఇందులో పనిచేస్తున్నాం. ఉద్యోగులతో మాట్లాడి ఈ సమస్యలు పరిష్కరిస్తాం’ అని స్పష్టం చేశారు. అంతరిక్ష రంగంలో భారత్కు ఉన్న విస్తృత లక్ష్యాల దృష్ట్యా.. రాబోయే కాలంలో ప్రయోగాల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి ఏడాదికి సుమారు 50 ప్రయోగ వాహనాలు అవసరమని చెప్పారు. శాస్త్రవేత్తల రాజీనామాపై ప్రశ్నించగా.. ఇస్రోలో 8 వేల మందికిపైగా శాస్త్రవేత్తలు సహా 20 వేల మంది ఉద్యోగులు ఉన్నారని బదులిచ్చారు. గత ఐదారేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఏటా 150 మంది రాజీనామా చేశారని, ఏ సంస్థలోనైనా ఇది సహజమేనని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఫేక్ ప్రచారానికి ఫ్యాక్ట్తో కౌంటర్