కరూర్ తొక్కిసలాట ఘటన.. సీఎం విజయ్ సంచలన కామెంట్లు..
ABN , Publish Date - Jul 10 , 2026 | 01:32 PM
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కరూర్లో పర్యటించారు. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు ఉద్యోగ పత్రాలు పంపిణీ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కరూర్లో పర్యటించారు. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు ఉద్యోగ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ.. కరూర్ ఘటన తనను ఎంతో బాధించిందని అన్నారు. ఈ ఘటనను డీఎంకే పార్టీ రాజకీయం చేసిందంటూ మండిపడ్డారు. తొక్కిసలాటకు తనను బాధ్యుడిని చేయాలని డీఎంకే విశ్వ ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. తనకు ప్రజలే ముఖ్యమని, డబ్బు కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా ప్రజల కోసమే కరూర్కు వచ్చానని చెప్పారు.
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ఘటన జరిగిన రోజు ఎవరు ఆదేశాలు ఇచ్చారు?.. ఎవరు బాధ్యులు?. కరూర్ పోలీసులను నేను నమ్మాను. దానివల్ల నన్ను నమ్మినవారిని కోల్పోయా. పోలీసులు నన్ను కరూర్లో ప్రవేశించకుండా అడ్డుకుని ఉండొచ్చు. కానీ, వాళ్లు అలా చేయలేదు. సభను రద్దు చేసే అన్ని హక్కులు వారికి ఉన్నాయి. కానీ, వాళ్లు రద్దు చేయలేదు. పైగా నన్ను లోపలికి రానిచ్చారు. ఈ సంఘటనకు నిజమైన బాధ్యులు ఎవరు? ఎవరు చేశారిదంతా?’..
‘నేను ఇంట్లో బాధతో అల్లాడిపోతున్న సమయంలో దారుణంగా విమర్శించారు. ఇంట్లో దాక్కున్నానని అన్నారు. సరిపడా పోలీసులను బందోబస్తు కోసం పంపలేదు?. కానీ, సిగ్గులేకుండా నన్ను నిందిస్తున్నారు. ఎమ్కే స్టాలిన్ అసెంబ్లీలో దీనిపై రాజకీయాలు చేశారు. నా రాజకీయ ప్రత్యర్థులు, పోలీసులు కలిసి కరూర్ తొక్కిసలాటకు కారణమయ్యారు. తమిళనాడును డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు దోచుకున్నాయి. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఉండవు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
అధిక లాభాల పేరుతో ఖాతాదారులకు టోకరా.. ఆల్మైటి జెనిసెస్ డైరెక్టర్ల అరెస్ట్
ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపండి.. రైతులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి