నక్సల్ రహిత భారత్ లక్ష్య సాధనపై కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:42 PM
నక్సల్ రహిత భారత్ లక్ష్య సాధనపై కేంద్ర హోం శాఖ ప్రకటన చేసింది. దేశ అంతర్గత భద్రతలో భాగంగా హోం శాఖ కీలక మైలురాయిని చేరిందని ప్రకటించింది. ఈ మేరకు నక్సలిజం అణచివేతపై నివేదికను విడుదల చేసింది.
ఢిల్లీ: నక్సల్ రహిత భారత్ లక్ష్య సాధనపై కేంద్ర హోం శాఖ ప్రకటన జారీ చేసింది. దేశ అంతర్గత భద్రతలో భాగంగా హోం శాఖ కీలక మైలురాయిని చేరిందని ప్రకటించింది. ఈ మేరకు నక్సలిజం అణచివేతపై నివేదికను విడుదల చేసింది. నక్సల్ రహిత భారత్ (Naxal-Free India) లక్ష్య సాధనలో అత్యంత వ్యూహాత్మక అడుగులు వేసినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘ట్రేస్, టార్గెట్, న్యూట్రలైజ్’ సిద్ధాంతంతో మావోయిస్టుల నెట్వర్క్ను భద్రతా దళాలు పూర్తిగా నిర్వీర్యం చేశాయని పేర్కొంది.
ఒకప్పుడు నక్సలైట్లకు కోటలుగా ఉన్న వారి సురక్షిత ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు హోం శాఖ వెల్లడించింది. నక్సలిజంపై పోరులో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి అధునాతన లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్లను రంగంలోకి దింపినట్లు తెలిపింది. కాల్ లాగ్ విశ్లేషణ, మొబైల్ డేటా అనలిటిక్స్ ద్వారా మావోల కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. సోషల్ మీడియాలో నిరంతర నిఘా ద్వారా వారి డిజిటల్ ప్రచారం, నిధుల సమీకరణ, నియామకాలకు గట్టి బ్రేక్ వేసినట్లు వెల్లడించింది. సాంకేతిక ఇన్పుట్ల ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న భద్రతా దళాల కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచినట్లు వివరించింది.
కాగా, ‘ఆపరేషన్ కగార్’ పేరుతో 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దేశవ్యాప్తంగా వారి కదలికలపై నిఘా పెట్టింది. ఎన్కౌంటర్లలో కొంతమంది అగ్రనేతలను భద్రతా దళాలు మట్టుబెట్టగా.. మరికొంతమంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మరోవైపు మావోయిస్టు కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా భారీ సంఖ్యలో వివిధ రాష్ట్రాల పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి
నీట్ రీటెస్టుపై పిటిషన్.. తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నో
సీఎం విజయ్కు ఊరట.. బలపరీక్షపై పిటిషన్ను కొట్టేసిన సుప్రీం కోర్టు