సీఎం స్టాలిన్ తో మాజీ సీఎం పన్నీర్ సెల్వం భేటీ
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:20 PM
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. సీఎం స్టాలిన్ తో మాజీ సీఎం ఓ. పన్నీర్ సెల్వం(ఓపీఎస్) భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం స్టాలిన్కు ఓపీఎస్ మద్దతు తెలిపారు.
చెన్నై, ఫిబ్రవరి 20: తమిళనాడు రాజకీయాల్లో(Tamil Nadu politics) సంచలనం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో మాజీ సీఎం, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ. పన్నీర్ సెల్వం(O Panneerselvam) భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే ఐదేళ్ల పాలనను ప్రశంసించారు. 'డీఎంకే ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుంది. గత ఐదేళ్లుగా సీఎం స్టాలిన్ విజయవంతమైన, సుపరిపాలన అందించారు. అందుకే నేను ఈరోజు సీఎం స్టాలిన్ను కలిసి.. అభినందనలు తెలిపాను. అలానే డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ డీఎంకే గెలుస్తుంది' అని అన్నారు.
ఇవాళ(శుక్రవారం)చెన్నైలోని అసెంబ్లీ ప్రాంగణంలో వీరి భేటీ జరిగింది . ఈ సమావేశం సందర్భంగా ఓ. పన్నీర్సెల్వం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీ స్నేహపూర్వకంగా జరిగిందని, అలానే ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకుల మధ్య పరస్పర గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేస్తున్నాయి. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడక ముందే అన్ని పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీలు అధికారమే లక్ష్యంగా కీలక భేటీలు నిర్వహిస్తున్నాయి. ఈ సారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. ఈ ప్రధాన పార్టీలతో పాటు సినీ నటుడు విజయ్ కూడా టీవీకే పార్టీని స్థాపించి.. ఎన్నికల బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. దీంతో దేశమంతా తమిళనాడు రాజకీయాల వైపు ఆసక్తిగా చూస్తోంది.
ఇవి కూడా చదవండి..
అమెరికా ఆధ్వర్యంలోని కీలక కూటమిలో భారత్ చేరిక
రణ్వీర్ సింగ్కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్