అయోధ్య మహాయజ్ఞంలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన యజ్ఞ మండపం
ABN , Publish Date - Mar 28 , 2026 | 07:36 PM
అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది తీరంలోని బస్తీ ఘాట్ వద్ద శనివారం నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ ప్రమాదం సంభవించింది.
లక్నో: అయోధ్య (Ayodhya)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది తీరంలోని బస్తీ ఘాట్ వద్ద శనివారం నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ ప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్ మంత్రి దయా శంకర్ సింగ్ ఈ మహాయజ్ఞం నిర్వహించారు. తొమ్మిదోరోజు పూర్ణాహుతి పూర్తయిన కొద్ది గంటలకే ప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా విస్తరించడంతో యజ్ఞ మండపం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఆరు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చాయి.
మంటలు విస్తరించక ముందే వందలాది మంది భక్తులు అక్కడ నుంచి బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముగ్గురు గాయాల బారిన పడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. బలమైన గాలుల కారణంగానే మంటలు వేగంగా విస్తరించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యజ్ఞకుండంలోని నిప్పురవ్వలు ఎగసి పడటంతో మండపానికి మంటలు అంటుకున్నట్టు చెబుతున్నారు. అయితే ప్రమాద కారణాలు వెంటనే తెలియలేదు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు చెప్పారు.
మహాయజ్ఞం నిర్వహించిన ప్రాంతం అయోధ్యలోని రామాలయానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉంది. మహాయజ్ఞం కోసం 1200 హోమగుండాలు ఏర్పాటు చేయగా, వీటిలో చాలామటుకు కాలిబూడదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
మీరు రావద్దు, ప్రధాని పదవి పోతుందన్నారు.. నొయిడా సెంటిమెంట్పై మోదీ
డీఎంకే జాబితా విడుదల.. కొలతూర్ నుంచి సీఎం స్టాలిన్ పోటీ