దొంగ ఓట్లు.. హింసకు చోటులేదు!
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:39 AM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం(ఈసీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది...
ఎన్నికల వేళ టీఎంసీకి ఎన్నికల సంఘం హెచ్చరిక
బీజేపీతో ఇదే భాష వాడే ధైర్యం ఉందా?: టీఎంసీ
కోల్కతా, ఏప్రిల్ 8: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం(ఈసీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దొంగ ఓట్లు, బూత్ ఆక్రమణలు వంటి చర్యలను సహించబోమని పేర్కొంది. ఈసారి భయం, హింస, బెదిరింపులు, ప్రలోభాలకు తావులేకుండా ఎన్నికలు జరగాలని స్పష్టం చేసింది. అలాగే బూత్ క్యాప్చరింగ్, బూత్ జామింగ్తో పాటు ఓటర్ల సమీకరణకు, ప్రవేశానికి అంతరాయం కలిగించే సోర్స్ జామింగ్ వంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించింది. ఇది టీఎంసీకి చేస్తున్న సూటి హెచ్చరిక అని ‘ఎక్స్’ వేదికగా ఈసీ పేర్కొంది. ఈసీ వ్యాఖ్యలపై తృణమూల్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈసీ కేవలం ఒక పార్టీనే లక్ష్యంగా చేసుకుంటోందని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే విమర్శించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను బీజేపీ దళారిగా ఆయన అభివర్ణించారు. బీజేపీ విషయంలోనూ ఇదే తరహా భాషను ఉపయోగించే ధైర్యం ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. మరోవైపు, టీఎంసీ ప్రతినిధి బృందానికి, ఈసీకి మధ్య బుధవారం జరిగిన భేటీ రసాభాసగా మారింది. బీజేపీ అనుకూల, అవినీతి అఽఽధికారులను ఎన్నికల విధుల్లో నియమిస్తూ నిష్పక్షపాత ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించినందుకు.. సీఈసీ జ్ఞానేశ్కుమార్ తమను సమావేశం నుంచి వెళ్లిపొమ్మన్నారని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ చెప్పారు. ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా నుంచి 91లక్షల మంది పేర్లను తొలగించడంపై కోర్టును ఆశ్రయిస్తామని సీఎం మమత అన్నారు. బీజేపీకి ఓటేయడం అంటే చేపలు, మాసం తినడాన్ని, బెంగాలీలో మాట్లాడటాన్ని వదులుకోవడమేనని ప్రజలను మమత హెచ్చరించారు. యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రజలు మాంసం తినడానికి అనుమతి లేదన్నారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..