Double Decker Buses: 18 యేళ్ల తర్వాత.. మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:25 AM
చెన్నై మహానగరంలో.. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులు గతంలో నగరంలో అందుబాటులో ఉండేవి. అయితే.. మళ్లీ వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించి మళ్లీ వీటిని సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
- పచ్చజెండా ఊపి ప్రారంభించిన సీఎం స్టాలిన్
చెన్నై: నగరంలో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సేవలు ప్రారంభమయ్యాయి. అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తమిళులు, ప్రముఖులు సమకూర్చిన నిధులతో తొలి విడతగా ఏసీతో కూడిన విద్యుత్తో నడిచే ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్ను సోమవారం ఉదయం నందంబాక్కం ట్రేడ్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి స్టాలిన్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని మహానగర రవాణా సంస్థ (ఎంటీసీ) గతంలో పల్లవన్ రవాణా సంస్థ (పీటీసీ)గా ఉన్నప్పుడు 1970లో బ్రాడ్వే నుంచి తాంబరం వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడుపుతుండేవారు.
ఆ బస్సులో కండెక్టర్ సీటు పక్కనే పై అంతస్థుకు వెళ్లేందుకు గుండ్రంగా ఇనుపమెట్లుండేవి. 2007లో ఆ డబుల్ డెక్కర్ బస్ సేవలను నిలిపివేశారు. 2021లో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని నిర్ణయించింది. అశోక్ లైలాండ్ సంస్థ నుండి 20 డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులు రాజధాని నగరం అందాలను ఆస్వాదించడానికి అనువుగా కీలకమైన ప్రాంతాలకు ఈ బస్సులను నడపాలని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయించింది.
ఆ ప్రకారం తొలివిడతగా అమెరికాలోని ప్రవాస తమిళ ప్రముఖులు సమకూర్చిన నిధులు రూ.1.89 కోట్లతో ఏసీ సదుపాయంతో కూడిన ఎరుపు రంగు డబుల్ డెక్కర్ ఈవీ బస్సును అశోక్ లైలాండ్ సంస్థ నుండి రాష్ట్ర పర్యాటక శాఖ కొనుగోలు చేసింది. ఈ బస్సుకు ఇరువైపులా తంజావూరు బృహదీశ్వరాలయం, లైట్హౌస్, రిప్పన్భవనం, జల్లికట్టు చిత్రాలున్నాయి. ‘తమిళ్ వాళ్గ’ (తమిళం వర్థిల్లాలి) అనే అక్షరాలు అందంగా ముద్రించారు.. ఈ డబుల్ డెకర్ ఈవీ బస్సును ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించి ఆ బస్సులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు రాజేంద్రన్, ఎస్ఎం నాజర్, టీఆర్బీ రాజా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్.మురుగానందం, పర్యాటక శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే మణివాసన్, ప్రభుత్వ రంగ కార్యదర్శి రీటా హరీష్ టక్కర్, పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి.క్రీస్తురాజా, అశోక్లేలాండ్ సంస్థ సీఈఓ సోను అగర్వాల్, ఎన్వీ గ్రూపు సీఈఓ వీర వేణుగోపాల్, స్విచ్ మొబిలిటీ సంస్థ సీఈఓ ఎస్ గణేష్ మణి తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణ మార్గం...
ఈ డబుల్ డెక్కర్ ఈవీ బస్సును రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీటీడీసీ) ప్రధాన కార్యాలయం, ఎల్ఐసీ, స్పెన్సర్ ప్లాజా, పల్లవన్ రోడ్డు, రాజా అన్నామలై మండ్రం, సెక్రటేరియట్, రిజర్వు బ్యాంక్, హార్బర్, నేపియర్ బ్రిడ్జి, అన్నా సమాధి ప్రాంతం, లైట్ హైస్, పట్టినంబాక్కం బీచ్, శాంథోమ్ చర్చి, డీజీపీ కార్యాలయం, క్వీన్ మేరీస్ కళాశాల, వివేకానందర్ ఇల్లమ్, రాజధాని కళాశాల, మద్రాసు వర్శిటీ, దూరదర్శన్ కేంద్రం, రాజా మండపం, ఓమండూరార్ ఆస్పత్రి వీక్షించేలా టీటీడీసీ ప్రధాన కార్యాలయం వరకు నడుపనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వందేభారత్ స్లీపర్లో నో ఆర్ఏసీ
‘తుంగభద్ర’ గేటు ట్రయల్రన్ సక్సెస్
Read Latest Telangana News and National News