కూలిన ఢిల్లీ హాస్టల్ భవనం.. శిథిలాల కింద చిక్కుకుని వీడియో కాల్
ABN , Publish Date - Sep 07 , 2026 | 09:23 AM
ఢిల్లీ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ఇప్పటికే పలువురు మరణించారు. సుమారు 50 మంది వరకూ విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని సహాయక సిబ్బంది భావిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ఇప్పటికే ఆరుగురు మరణించారు. సుమారు 50 మంది వరకూ విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని సహాయక సిబ్బంది భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఓ విద్యార్థి సాయం కోసం వీడియో కాల్ చేశాడు. ఈ వీడియోను నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా నెట్టింట షేర్ చేసింది. కాంక్రీట్ శకలాల మధ్య, ముఖంపై గాయాలతో విద్యార్థి కనిపించాడు. సాయాన్ని అర్థించేందుకు తన శక్తినంతా కూడదీసుకుని వీడియో కాల్ చేశాడు.
ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భవనం కూలింది. దాదాపు 50 ఏళ్ల క్రితం భవనాన్ని నిర్మించారు. భవనం కూలిన సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు బేస్మెంట్లోకి నీరు చేరి పునాది బలహీనపడి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న 11 మందిని ఇప్పటివరకూ వెలికితీశారు. మరో 50 మంది వరకూ శిథిలాల కింద ఉండి ఉండే అవకాశం ఉందని సహాయకసిబ్బంది భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ సందర్శించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు సహాయసిబ్బందికి కాల్స్ చేస్తున్నారని చెప్పారు. సహాయకబృందాలు వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. హాస్టల్లో ఉంటున్న వారిలో అధిక శాతం మంది యూపీ, హర్యానా, కేరళ రాష్ట్రాలకు చెందిన వారని స్థానికుడు ఒకరు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి
ఉద్యోగం ఉన్నంత మాత్రాన వైకల్యం తక్కువైనట్లు కాదు