అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి బుల్డోజర్లు..
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:19 PM
అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం అత్యంత సీరియస్గా స్పందిస్తోంది. సిటీలోని అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లను ఉపయోగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మున్సిపల్ అధికారులకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం అత్యంత సీరియస్గా స్పందిస్తోంది. సిటీలోని అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లను ఉపయోగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మున్సిపల్ అధికారులకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. బుల్డోజర్ యాక్షన్ జరుగుతున్న సమయంలో సీనియర్ మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలంలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న అన్ని పీజీ హాస్టల్స్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అక్రమ నిర్మాణాలు ఎప్పుడు? ఎవరి హయాంలో జరిగాయో తెలుసుకోవడానికి బిల్డింగ్స్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సత్యనికేతన్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు..
దక్షిణ ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఐదు అంతస్థుల పెయింగ్ గెస్ట్ హాస్టల్ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమందికి తీవ్రగాయాలు అయ్యాయి. 50 ఏళ్లనాటి భవనానికి బేస్మెంట్లో కొన్ని మార్పుచేర్పులు చేపట్టడంతో అది పేకమేడలాగా కుప్పకూలింది. ఈ ఘటనపై సీఎం రేఖా గుప్తా సీరియస్గా స్పందిస్తూ.. మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ సహా ఐదుగురు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధికారులు సస్పెండ్ అయ్యారు. రాజస్థాన్లో దాక్కున్న బిల్డింగ్ యాజమానిని పోలీసులు ఢిల్లీ తీసుకువచ్చారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం సిటీ వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది. బుల్డోజర్ యాక్షన్కు తెర తీసింది.
ఇవి కూడా చదవండి
ఎండుతున్న వరి.. వాడుతున్న పత్తి
ఫోల్డబుల్ ఐఫోన్.. ఇదే నిజమైతే అభిమానులకు పండగే!