విశ్వం వైపు చూస్తూ సేద తీరేందుకు ఉత్తమ చోటు!
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:11 PM
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సండే సంచారి సిరీస్లో భాగంగా తమిళనాడులోని ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతాన్ని నెటిజన్లకు పరిచయం చేశారు. అదే.. కొల్లి హిల్స్లోని ఆరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ 'డార్క్ స్కై పార్క్'.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 12: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిరంతరం ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన తన 'సండే సంచారి' సిరీస్లో భాగంగా తమిళనాడులోని ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతాన్ని నెటిజన్లకు పరిచయం చేశారు. అదే.. కొల్లి హిల్స్లోని ఆరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ 'డార్క్ స్కై పార్క్' (Dark Sky Park).
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, నగరం నిండా ఉండే వెలుతురు వల్ల మనం రాత్రి పూట ఆకాశంలోని చుక్కలను చూడటమే మర్చిపోయాం. 'ప్రపంచమంతా అలజడితో నిండి ఉన్న ఈ సమయంలో, అనంతమైన విశ్వం వైపు చూస్తూ ప్రశాంతతను పొందడం అత్యుత్తమ మార్గం' అని మహీంద్రా పేర్కొన్నారు.
దక్షిణ భారతదేశంలో అరుదైన ప్రాంతమైన ఈ ప్రదేశం.. రాత్రి వేళ ఆకాశం పూర్తి అందంతో కనిపించే అతికొద్ది ప్రాంతాల్లో ఇది ఒకటి. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు, ఆమె బృందం ఈ ప్రాంతాన్ని సహజత్వానికి భంగం కలగకుండా ఎకో-ఫ్రెండ్లీ పద్ధతిలో తీర్చిదిద్దారు. ఇక్కడ పర్యావరణాన్ని కాపాడటం కోసం సందర్శకుల సంఖ్యను పరిమితం చేశారు. అలాగే మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. చీకటి అనేది మనం కాపాడుకోవాల్సిన, తిరిగి కనుగొనాల్సిన ఒక అరుదైన వనరు అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇది తమిళనాడులోని కొల్లి హిల్స్ (Kolli Hills)లో ఉంది. లడఖ్లోని హాన్లే లేదా అటాకామా వంటి ప్రపంచ ప్రసిద్ధ డార్క్ స్కై రిజర్వ్ల స్థాయిలో లేకపోయినా, ప్రకృతి ప్రేమికులకు, ఆస్ట్రో-ఫొటోగ్రఫీ (నక్షత్రాల ఫోటోలు తీసేవారు) ఇష్టపడే వారికి ఇది ఒక స్వర్గం లాంటిదని ఆయన కొనియాడారు. ఇక, బిజీ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని, ప్రశాంతమైన రాత్రి ఆకాశం కింద గడపాలి అనుకునే వారికి ఆరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఒక చక్కని గమ్యస్థానం. ఆనంద్ మహీంద్రా సూచనతో ఇప్పుడు ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి
ఇజ్రాయెల్కు తుర్కియే వార్నింగ్.. దాడి చేయటం మా కర్తవ్యం..
చైనాకు ట్రంప్ వార్నింగ్.. స్పందించిన ఎంబసీ..