Share News

అన్నాదురై, ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ తర్వాత నేనే!

ABN , Publish Date - Sep 08 , 2026 | 05:27 AM

అన్నాదురై, ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ తర్వాత నేనే!’’- అని తమిళనాడు సీఎం విజయ్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘1967, 1977, 1982, 2026.. అన్నాదురై, ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌. ఈ వరుసలో ప్రస్తుతం విజయ్‌. ప్రజలంతా ఇలానే భావిస్తున్నారు.

అన్నాదురై, ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ తర్వాత నేనే!
Cm vijay

  • తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ వ్యాఖ్యలు..మహిళలను దూషిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

చెన్నై, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘‘అన్నాదురై, ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ తర్వాత నేనే!’’- అని తమిళనాడు సీఎం విజయ్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘1967, 1977, 1982, 2026.. అన్నాదురై, ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌. ఈ వరుసలో ప్రస్తుతం విజయ్‌. ప్రజలంతా ఇలానే భావిస్తున్నారు. ప్రకృతితో పాటు ప్రజలు కూడా మాకు ఎల్లవేళలా అండగా ఉంటారు’’ అని అన్నారు. ఇక, మహిళలను దూషించినా, వ్యక్తిగత దాడులు చేసినా, డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో మానసిక వేదనకు గురిచేసినా.. కఠిన చర్యలు తప్పవని ప్రతిపక్ష డీఎంకే నేతలను ఉద్దేశించి సీఎం విజయ్‌ హెచ్చరించారు. తొలుత జయలలిత పేరును ప్రస్తావించిన విజయ్‌.. 1989లో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు సభలో జయలలితకు జరిగిన అవమానాన్ని గుర్తుచేస్తూ.. ఆ రోజును ‘చీకటి రోజు’గా అభివర్ణించారు. అలాంటి రోజులను పునరావృతం కానివ్వబోమని వ్యాఖ్యానించారు. అనంతరం.. నటి త్రిషపై ఇటీవల కొందరు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ప్రజా జీవితంలో ఉన్న మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాజకీయపరంగా విమర్శించుకోవడంలో తప్పులేదని, అయితే వ్యక్తిగతంగా మహిళలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


డీఎంకే పాలన అంతా అవినీతిమయమని, గతంలో డీఎంకే అధ్యక్షుడిగా ఉన్న కరుణానిధి సీఎం పదవిని దుర్వినియోగం చేశారని విజయ్‌ ఆరోపించారు.కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడే తన మేనల్లుడు మురసోలిమారన్‌.. వీరాణం టెండర్ల జారీకి కాంట్రాక్టర్ల నుండి 2.5ు దాకా ముడుపులు వసూలు చేశారని విమర్శించారు. మాయమాటలతో ప్రజలను మోసగించిన డీఎంకే బూటకపు బ్రాండ్‌ను త్వరలోనే ధ్వంసం చేస్తానని శపథం చేశారు. అయితే, కరుణానిధి పట్ల తనకు గౌరవం ఉందని తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విడుదల చేసిన 100 పేజీల నివేదికలో పార్టీ ఫండ్‌ పేరుతో డీఎంకే సాగించిన వసూళ్ల బండారం బయటపడిందన్నారు. పార్టీ ఫండ్‌ పేరుతో వసూళ్లు సాగించి మాజీ సీఎం స్టాలిన్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి లబ్ధిపొందారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో ‘సర్‌’ గడువు పొడిగింపు

తల్లిని అవమానిస్తే.. కొడుకు రక్తం మరగదా?

Updated Date - Sep 08 , 2026 | 05:27 AM