ప్రభుత్వం కూలుతుందన్న డీఎంకే ప్రచారాన్ని కొట్టిపారేసిన తమిళనాడు సీఎం విజయ్
ABN , Publish Date - Jul 02 , 2026 | 10:00 AM
తమిళనాడులో రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వంపై వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి విజయ్ గట్టి సమాధానమిచ్చారు. చెన్నైలో నిర్వహించిన మిత్రపక్షాల ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, కూటమి నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
చెన్నై, జూలై 2: తమిళనాడులో రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వంపై వస్తున్న ఊహాగానాలకు తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ అధినేత విజయ్ గట్టి సమాధానమిచ్చారు. చెన్నైలో నిర్వహించిన మిత్రపక్షాల ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, కూటమి నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూలిపోతుందంటూ ప్రతిపక్షాలు, కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
పూర్తి కాలం అధికారంలో ఉంటాం
తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని, ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం పూర్తి కాలం విజయవంతంగా కొనసాగుతుందని సీఎం విజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా తమను దెబ్బతీయాలని చూసే వారి వ్యూహాలు ఫలించవని స్పష్టం చేశారు.
సిద్ధాంతాలపై రాజీ పడేదే లేదు
ప్రభుత్వ పనితీరు, కూటమి గమనంపై మాట్లాడిన ముఖ్యమంత్రి, తమ ప్రయాణంలో రెండు ప్రధాన సూత్రాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకుండా, పారదర్శకమైన పాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తూ, లౌకికవాద విలువలను కాపాడతామని చెప్పారు. 'అవినీతిరహిత పాలన, లౌకికవాదం అనేవి మా ప్రభుత్వానికి రెండు కళ్లు. ఈ రెండు కీలక అంశాల్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదు' అని విజయ్ స్పష్టం చేశారు.
మిత్రపక్షాలకు పిలుపు
కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ మరింత సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. మిత్రపక్షాలన్నీ ఐక్యంగా ఉంటూ, కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. రాజకీయ విమర్శలను పక్కనబెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే అందరి ముందున్న ఏకైక లక్ష్యం కావాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్