Share News

కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకపై రిటైల్ పెట్రోల్ బంకుల్లో..

ABN , Publish Date - Jun 12 , 2026 | 09:13 AM

రిటైల్ పెట్రోల్ బంకుల్లో వాణిజ్య అవసరాల కోసం ఇంధన కొనుగోళ్లకు కేంద్రం బ్రేకులు వేసింది. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు ఇకపై బల్క్ సరఫరాదారుల వద్దనే ఇంధన కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించింది.

కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకపై రిటైల్ పెట్రోల్ బంకుల్లో..
Govt restricts bulk industrial fuel purchases

ఇంటర్నెట్ డెస్క్: వాణిజ్య అవసరాల కోసం రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్‌లో ఇంధన కొనుగోళ్లపై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించింది. పారిశ్రామిక, వాణిజ్య, ఇతర వ్యవస్థాగత కొనుగోలుదార్లు ఇకపై రిటైల్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అధీకృత బల్క్ సరఫరాదారుల ద్వారా తమకు కావాల్సిన ఇంధనాన్ని కొనుగోలు చేయాలని చెప్పింది. 90 రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది.


రిటైల్ పెట్రోల్ బంకుల్లో ఇంధనం తక్కువ ధరకు లభిస్తున్న నేపథ్యంలో బల్క్ కొనుగోళ్లు పెరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. రిటైల్, బల్క్ డీజిల్ ధరల్లో వ్యత్యాసం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఢిల్లీలోని రిటైల్ పెట్రోల్ బంక్‌లల్లో లీటర్ డీజిల్ ధర రూ.95.20గా ఉంది. బల్క్ సరఫరాదారుల వద్ద డీజిల్ ధర లీటరుకు రూ.134.50గా ఉంది. దీంతో, కొందరు కమర్షియల్, పారిశ్రామిక యూజర్లు సాధారణ రిటైల్ పెట్రోల్ బంకులవైపు మళ్లుతున్నట్టు అధికారులు గుర్తించారు.


ఇక సామాన్య వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, అనుమతుల్లేని ప్రొక్యూర్మెంట్, ఇంధనాల దారి మళ్లింపు, ఇతర అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అందరి అవసరాలకు అనుగుణంగా ఇంధనం అందుబాటులో ఉండేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

గృహిణుల శ్రమ విలువ నెలకు 30 వేల కన్నా ఎక్కువే

నాణ్యతా ప్రమాణాలు లేకుండా.. తేజస్‌ ఎంకే1ఏ ఫైటర్‌కు విడిభాగాలు!

Updated Date - Jun 12 , 2026 | 09:54 AM