ఇథనాల్ బ్లెండింగ్ లేకపోతే పెట్రోల్ ధర రూ.125కు చేరేది: కేంద్రం
ABN , Publish Date - Aug 01 , 2026 | 03:08 PM
ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని కేంద్రం మరోసారి సమర్థించుకుంది. ముడి చమురు బ్యారెల్ ధర 135 డాలర్లకు చేరిన రోజుల్లో ఇథనాల్ బ్లెండింగ్ లేకపోయి ఉంటే న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.125కు చేరేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని కేంద్రం మరోసారి సమర్థించుకుంది. ముడి చమురు బ్యారెల్ ధర 135 డాలర్లకు చేరిన రోజుల్లో ఇథనాల్ బ్లెండింగ్ లేకపోయి ఉంటే న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.125కు చేరేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా అప్పట్లో ప్రజలు లీటరుకు రూ.94.77 మాత్రమే చెల్లించారని తెలిపింది. లీటర్ పెట్రోల్లో 20 శాతం వరకూ ఇథనాల్ కలపడంతో పెరిగిన ముడి చమురు ధరల భారం నుంచి ప్రజలకు రక్షణ లభించిందని పేర్కొంది. ధరలు పతాకస్థాయిలో ఉన్నప్పుడు లీటరుకు రూ.30 వరకూ ప్రజలకు ఆదా అయ్యిందని తెలిపింది.
ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన తరువాత దాదాపు 75 రోజుల పాటు ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయని కేంద్రం పేర్కొంది. మే నెలలో లీటరుకు రూ.7.5 చొప్పున పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ20 పెట్రోల్ (91-ఆక్టేన్) ధర ఢిల్లీలో రూ.102.12గా ఉందని, 100-ఆక్టేన్ పెట్రోల్ ధర రూ.169గా ఉందని పేర్కొంది. పేదల కోసం ఉద్దేశించిన ధాన్యాన్ని ఇథనాల్ ఉత్పత్తికి మళ్లిస్తున్నారన్న ఆరోణలను కూడా కేంద్రం తోసిపుచ్చింది.
ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని శాస్త్రీయమైన పద్ధతిలో దశలవారీగా ప్రవేశపెట్టామని కూడా పెట్రోలియం శాఖ చెప్పింది. ఉత్పత్తి సామర్థ్యం, మౌలిక వసతులకు అనుగుణంగా ఈ విధానాన్ని అంచలంచెలుగా ప్రవేశపెట్టామని పేర్కొంది. ఈ10 ఇంధనానికి అనువుగా రూపొందించిన బీఎస్-3, బీఎస్-4, బీఎస్-6 వాహనాల్లో ఈ20 పెట్రోల్ వాడినప్పుడు మైలేజీ వాహన కేటగిరీని బట్టి 2-6 శాతం మేర తగ్గొచ్చని తెలిపింది. అయితే, ఈ వాహనాల మైలేజీ 3-5 శాతం మేర తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ గతంలో రాజ్యసభలో వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
రీల్స్లోనే క్షమిస్తారా.. కేసులూ ఎత్తేస్తారా.. ప్రధాని మోదీకి సీజేపీ అధినేత అభిజీత్ ప్రశ్న..
భారీ వరదలు.. ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టు పైకి ఎక్కిన యువకుడు..