మూడో భాషకు అంతర్గత పరీక్షలు తప్పనిసరి
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:19 AM
నూతన విద్యా విధానంలో భాగంగా అమలు చేయనున్న 3భాషల విధానంపై సీబీఎ్సఈ మరింత స్పష్టత ఇచ్చింది. ఏయే తరగతుల్లో మూడో భాష పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నదానిపై వివరణ...
ఆ మార్కులకూ పాస్ సర్టిఫికెట్లో స్థానం
ప్రస్తుతానికి పదో తరగతి ఫైనల్ పరీక్షలో ఆ
పేపరు ఉండదు.. సీబీఎస్ఈ సర్క్యులర్ జారీ
న్యూఢిల్లీ, జూలై 14: నూతన విద్యా విధానంలో భాగంగా అమలు చేయనున్న 3భాషల విధానంపై సీబీఎ్సఈ మరింత స్పష్టత ఇచ్చింది. ఏయే తరగతుల్లో మూడో భాష పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నదానిపై వివరణ ఇచ్చింది. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతూ 2027-28లో పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే వారికి మూడో భాష(ఆర్-3) పేపరు ఉండదని తెలిపింది. అయితే వారు పాఠశాలలో నిర్వహించే అంతర్గత పరీక్ష (ఇంటర్నల్ అస్సె్సమెంట్)ల్లో మాత్రం తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని తెలిపింది. ఆ మార్కులను సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్లో పొందుపరుస్తారని కూడా పేర్కొంది. ఒకవేళ అంతర్గత పరీక్షల్లో ఎవరైనా ఉత్తీర్ణులు కాకపోతే తుది ఫలితాలు వెలువడకముందే వారికి ఆయా పాఠశాలలు మరోసారి పరీక్షలు జరపాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ఈ నెల 10న సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాలల్లో నిర్వహించే అంతర్గత ఆర్-3 అస్సె్సమెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానప్పటికీ వారికి పదో తరగతికి ప్రమోట్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే పదో తరగతి చదువుతున్నప్పుడే వారు తొమ్మిదో తరగతి ఆర్-3 పరీక్షలో పాసు కావాల్సి ఉంటుందని తెలిపింది. మూడు భాషల విషయమై జూన్ 29న జారీ చేసిన సర్క్యులర్కు అనుబంధంగా తాజా సూచనలు చేసింది. ఆరో తరగతి నుంచి తప్పనిసరిగా మూడు భాషలను నేర్చుకోవాల్సి ఉంటుందని జూన్ నెల సర్క్యులర్లో పేర్కొంది. అందులో రెండు భారతీయ భాషలు ఉండాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, సీబీఎ్సఈ ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి తీసుకువచ్చిన త్రిభాషా విధానాన్ని మధ్యంతరంగా నిలుపుదల చేయలేమని(స్టే) సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఒక భాషను నేర్చుకోవడం సమయం వృథా కిందకు రాదని స్పష్టం చేసింది. అయితే, త్రిభాషా విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. దీనిపై వచ్చే బుధవారం విచారించనున్నట్టు పేర్కొంది. ఈ వ్యవహారంపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుగుబాటు ఎంపీలకు శివసేన ( (UBT) లీగల్ నోటీసులు
రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!