Share News

సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన

ABN , Publish Date - May 31 , 2026 | 04:47 PM

ఓఎస్ఎం వ్యవస్థలో భద్రతా సంబంధిత లోపాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించామని సీబీఎస్‌ఈ తాజాగా ఎక్స్ వేదికగా వెల్లడించింది. మళ్లీ ఎలాంటి లోపాలు లేకుండా నిపుణుల బృందం ఈ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తోందని వెల్లడించింది.

సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన
CBSE OSM system

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) వ్యవస్థలో సైబర్‌సెక్యూరిటీ సంబంధిత సమస్యలున్నాయన్న ఆరోపణలపై సీబీఎస్‌ఈ తొలిసారిగా స్పందించింది. ఓఎస్‌ఎంలో బయటపడ్డ లోపాలపై తాము దృష్టిపెట్టామని ఎక్స్ వేదికగా చెప్పింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు బృందం ఓఎస్‌ఎం వ్యవస్థ భద్రతను మరింత మెరుగు పరిచేందుకు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తోందని తెలిపింది. ఇప్పటికే బయటపడ్డ లోపాలను పరిష్కరించామని తెలిపింది. ఇతరత్రా ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఓఎస్‌ఎం పోర్టల్‌ను మరింత భద్రమైన వేదికలోకి మారుస్తున్నామని కూడా తెలిపింది.

ఈ భద్రతా లోపాలను తమ దృష్టికి తెచ్చిన ఎథికల్ హ్యాకర్లు, పౌరులకు కూడా సీబీఎస్‌ఈ ధన్యవాదాలు తెలిపింది. వీరిలో కొందరిని నేరుగా సంప్రదించి కృతజ్ఞతలు చెప్పామని పేర్కొంది. ఇలాంటి లోపాలను గుర్తించిన వారు ఆ వివరాలను తమకు పంపించాలని కూడా సూచించింది.


ఓఎస్‌ఎం పోర్టల్‌లో భద్రతాలోపాలను 19 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ నిసర్గ అధికారి తొలిసారిగా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ పోర్టల్‌కు సంబంధించి ఏడబ్ల్యూఎస్ వ్యవస్థలో భద్రపరిచిన ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలు ఎవరైనా యాక్సెస్ చేయగలిగే పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకు ఆధారాలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టాడు. ఇదిలా ఉంటే, ఓఎస్‌ఎం వ్యవస్థ నిర్వహణ కేటాయింపునకు ఉద్దేశించిన టెండర్‌‌ నిబంధనల్లో కోయెంప్ట్ సంస్థకు అనుకూలంగా మార్పులు జరిగాయన్న 12వ తరగతి విద్యార్థి సార్థక్ సిద్ధాంత్‌ ఆరోపణలపై కూడా సీబీఎస్‌ఈ ఇప్పటికే స్పందించింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఒక ఓఎస్ఎం లోపాల కారణంగా మార్కుల కేటాయింపులో తప్పులు దొర్లినట్టు ఆరోపణలు కూడా రావడంతో విద్యార్థులకు మరోసారి వెరిఫికేషన్, రీఎవాల్యుయేషన్ అవకాశాన్ని ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త పోర్టల్‌ను జూన్ 1 నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

యూపీలో ఎన్‌కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి

న్యూజిలాండ్, సింగపూర్‌లతో భారత రక్షణ బంధం మరింత బలోపేతం

Updated Date - May 31 , 2026 | 04:56 PM